డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రం అనుసరిస్తున్న విధానంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
రాజకీయ లబ్ధి కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని ఖర్గే ఆరోపించారు. బుధవారం దిల్లీలోని ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. 16వ తేదీ నుంచి 3రోజులపాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశంలో ప్రధానంగా చర్చలు జరిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే విపక్షాలను దెబ్బతీయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ బిల్లులు తెస్తోందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేమంతా అనుకూలం. కానీ వారు దాన్ని తీసుకువచ్చిన విధానం పట్ల మాకు అభ్యంతరాలున్నాయి.
ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. కేవలం ప్రతిపక్ష పార్టీలను అణిచివేయడానికే ప్రభుత్వం ఇలా చేస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు మద్దతు ఇవ్వాలని మేమంతా నిర్ణయించాం. 2010 నుంచి 2023 వరకు రాజ్యాంగ సవరణకు అంగీకరించాం.
పాత సవరణలనే అమలు చేయాలని కోరుతున్నాం. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) విషయంలో ప్రభుత్వం కొన్ని గిమ్మిక్కులు చేస్తోంది. పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచి పార్లమెంటులో ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం.
మేం ఈ బిల్లును వ్యతిరేకిస్తాం, కానీ మహిళా రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు. ఈ బిల్లులో వారు పొందుపరిచిన విధానం చూస్తే కనీసం జనాభా లెక్కల ప్రక్రియను కూడా పూర్తి చేయకుండానే డీలిమిటేషన్ అంశాన్ని చేర్చారు.
రాజ్యాంగ అధికారాలన్నింటినీ కార్యనిర్వాహక వ్యవస్థ తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. ప్రధానంగా వ్యవస్థలు, పార్లమెంటు చేతుల్లో ఉండాల్సిన అధికారాన్ని ఎప్పుడైనా డీలిమిటేషన్ మార్చుకునే వీలుగా వారు తమ చేతుల్లోకి తీసుకున్నారు. అసోం, జమ్మూకశ్మీర్లో వారు ఇప్పటికే మమ్మల్ని మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.





