రాష్ట్రంలో సంతానోత్పత్తి పెంపునకు ఆటంకంగా ఉన్న ఆర్థికపరమైన సమస్యల్ని పరిష్కరించే దిశగా అన్ని వర్గాల ప్రజల ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత నైపుణ్య వికాస ప్రణాళికను రూపొందించిందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
జనాభా స్థిరీకరణ లక్ష్యంగా రూపొందించిన నూతన విధానంలో ఈ నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను పొందుపరిచారని మంత్రి సోమవారం నాడు ఒక ప్రకటనలో వివరించారు. నేటి శతాబ్దపు ఆర్థిక అవసరాలకు అనుగుణంగా అన్ని వయసుల వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
నూతన జనాభా నిర్వహణ విధానంలో భాగంగా ఆరోగ్యకర సమాజ నిర్మాణంతో పాటు ప్రజల ఆర్థిక సుస్థిరత కోసం అందరికీ నైపుణ్యాభివృద్ధి ఆవశ్యకతను గుర్తించి, ఆ మేరకు కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుందని మంత్రి వివరించారు.
ఆర్థిక, సామాజిక రంగాలకు అవసరమైన సేవల డిమాండ్ గుర్తింపు, లభ్యతల మధ్య వ్యత్యాసాలను గుర్తించి, కొరతను తీర్చే దిశగా శిక్షణా కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు. 21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థ వికాసంలో అందరూ పాల్గొనే విధంగా దోహదపడేందుకు నూతన జనాభా నిర్వహణ కోసం రూపొందించిన 5 స్థంభాల్లో (5 పిల్లర్స్) భాగంగా నైపుణ్యం అంశాన్ని పొందుపరిచినట్లు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వివరించారు.
ఈ దిశగా…2035 నాటికి 95 శాతం ప్రజలకు డిజిటల్ అక్షరాస్యతను కల్పించడం, 75 శాతం ప్రజలకు గుర్తించిన మేరకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, శిక్షణ పొందినవారిలో 80 శాతానికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించడం, శిశు సంరక్షణ మరియు వృద్ధులకు అవసరమైన సేవలందించేందుకు లక్ష మందికి సర్టిఫికెట్ కోర్సుల్ని అందించడం, శ్రామిక శక్తి భాగస్వామ్యంలో మహిళల వాటాను 25 శాతం పెంచడం వంటి లక్ష్యాల్ని నిర్ధారించినట్లు మంత్రి తెలిపారు.





