ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటివరకు కేవలం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ఇంప్రూవ్మెంట్ పరీక్షల అవకాశాన్ని ఇకపై సెకండియర్ విద్యార్థులకు కూడా విస్తరించాలని నిర్ణయించింది.
ఈ కొత్త నిబంధనలు మే 2026లో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో వేలాది మంది విద్యార్థులకు మార్కులు మెరుగుపరుచుకునే మరో అవకాశం లభించనుంది.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయం ఏప్రిల్ 18న సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ మార్గదర్శకాల ప్రకారం, మార్చి 2026లో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో సెకండియర్లో ఉత్తీర్ణులైనవారైనా, ఫెయిలైనవారైనా – తమకు ఇప్పటికే పాస్ అయిన సబ్జెక్టుల్లో కూడా మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాయడానికి అనుమతి ఉంటుందని బోర్డు తెలిపింది.
ఇప్పటి వరకు సెకండియర్ విద్యార్థులకు ఈ సౌకర్యం లేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పోటీ పరీక్షలు, ఉన్నత విద్య ప్రవేశాల్లో మార్కులు కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఈ మార్పు అవసరమని చాలా కాలంగా విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యార్థి వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులు, ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో సాధించిన మార్కుల మధ్య ఎక్కువ మార్కులు వచ్చిన వాటినే తుది ఫలితంగా పరిగణనలోకి తీసుకుంటారు. దీని వల్ల విద్యార్థులు తమ ప్రతిభను మెరుగ్గా చూపించుకునే అవకాశం పొందుతారు.
ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇప్పటికే ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా, ఇప్పుడు సెకండియర్ విద్యార్థులకు కూడా వర్తింపజేయడం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ముఖ్యంగా మెడిసిన్, ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పోటీ పడుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయం విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని,ఒకే పరీక్షలో తక్కువ మార్కులు రావడం వల్ల భవిష్యత్తు దెబ్బతినకుండా, మరో అవకాశం ఇవ్వడం ద్వారా సమాన అవకాశాలు కల్పించినట్లవుతుందని వారు తెలిపారు.





