ఫీజుల దోపిడీ… భగ్గుమన్న ఏబీవీపీ..

Must read

రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నాయంటూ వాటిపై కఠిన నియంత్రణ విధించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మంగళవారం హైదరాబాద్‌లో భారీ ఆందోళన చేపట్టింది. పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘం నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రావణ్​, బి. రాజ్​ నాయకత్వం వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. కమిషనరేట్ కార్యాలయం వద్ద గుమిగూడిన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను వినిపించారు.

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ప్రతి ఏడాది భారీగా ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. విద్యను వ్యాపారంగా మార్చి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజు నిర్మాణాన్ని పారదర్శకంగా ప్రకటించేలా నిబంధనలు అమలు చేయాలని కోరారు. పాఠశాలల్లో అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, ట్రాన్స్‌పోర్ట్, యూనిఫామ్, పుస్తకాలు తదితరాల పేరుతో అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని విద్యార్థి నాయకులు విమర్శించారు.

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల సమస్యతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత కూడా ప్రధాన సమస్యగా మారిందని ఏబీవీపీ నాయకులు తెలిపారు. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో తగిన తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, ఫర్నిచర్, డిజిటల్ బోధన సౌకర్యాలు లేవని ఆరోపించారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తేనే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

ఆందోళనలో భాగంగా విద్యార్థి నాయకులు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వారు ప్రయత్నించగా, పోలీసులు ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కార్యాలయం ప్రధాన గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని నిలువరించారు.

పోలీసుల అడ్డంకులను అధిగమించి కార్యాలయంలోకి వెళ్లేందుకు కొందరు కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురు ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. నిరసన కార్యక్రమం శాంతియుతంగా సాగేందుకు తాము చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ద్యా రంగంలో సంస్కరణలు తీసుకురావడం అత్యవసరమని, లేదంటే భవిష్యత్తులో విద్య మరింత ఖరీదైనదిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కూడా కోరారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!