రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎంతో కీలకమైన గృహప్రవేశాల మహోత్సవం జిల్లాలో సోమవారం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసిఫాబాద్లో ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేసిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోను ఇందిరమ్మ పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇండ్లను ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రారంభోత్సవాలు చేసారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలను చేయించారు.
ఆందోల్ మండలం మన్సాన్ పల్లిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులచే గృహప్రవేశాలు చేయించారు. నీరుడి జ్యోతి, గొల్ల లావణ్య, వంగ సుజాత లబ్ధిదారుల ఇండ్లను మంత్రి ప్రారంభించి గృహప్రవేశాలు చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలకు సొంతింటి కలను సాకారం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. దశాబ్దాలుగా గూడు కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం అందించేందుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ఇల్లు అనేది కేవలం నాలుగు గోడలు మాత్రమే కాదని, కుటుంబానికి భద్రత, ఆత్మవిశ్వాసం, సామాజిక గౌరవాన్ని కల్పించే ఆస్తి అని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ప్రతి అర్హత గల కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, సొంత ఇంటి కల నిజం కావడం జీవితంలో మరచిపోలేని ఆనందమని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ కుటుంబాలకు శాశ్వత భద్రతను కల్పించిందని, సమాజంలో ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా మంత్రికి మరియు ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ పాండు, స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, తహసీల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.





