కర్ణాటక రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిక్కబళ్లాపూర్ జిల్లా బాగేపల్లి పట్టణం సమీపంలో జాతీయ రహదారి-44పై జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ లారీ ఆటోను బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రత ఎంత భయానకంగా ఉందంటే ఆటో పూర్తిగా ధ్వంసమై నుజ్జునుజ్జయిపోయింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన వారంతా వలస కూలీలు. ఆదివారం రోజంతా పనులు ముగించుకుని సుమారు 15 మంది కూలీలు ఒకే ఆటోలో తమ నివాస ప్రాంతాలకు బయలుదేరారు. బాగేపల్లి సమీపంలోని గంగోత్రి పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న కంటైనర్ లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి ఆటో పల్టీలు కొడుతూ రోడ్డుపక్కకు విసిరివేయబడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో పురుషులు, మహిళలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. గాయపడిన తొమ్మిది మందిని స్థానికులు, పోలీసులు కలిసి సమీప ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు తెలిపాయి.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సేవా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో కంటైనర్ లారీ అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అయితే ప్రమాదం జరిగిన ఖచ్చితమైన పరిస్థితులను తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తున్నారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయంపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన మరోసారి రోడ్డు భద్రత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా జాతీయ రహదారులపై అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం కూడా ప్రమాద తీవ్రతను పెంచే అంశంగా భావిస్తున్నారు.





