హైదరాబాద్ నగరంలో వీధికుక్కల సమస్య మరోసారి తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై సుమారు 10 వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన నగరంలో కలకలం రేపింది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ దారుణ ఘటన బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని టీచర్స్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఘటన తర్వాత స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆద్విక్ అనే బాలుడు వేసవి సెలవుల సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చాడు. టీచర్స్ కాలనీలోని ఇంటి సెల్లార్ ప్రాంతంలో బాలుడు ఆడుకుంటుండగా ఒక్కసారిగా అక్కడికి వచ్చిన వీధికుక్కల గుంపు అతడిపై దాడి చేసింది.
సుమారు 10 కుక్కలు కలిసి బాలుడిని చుట్టుముట్టి దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. బాలుడు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కుక్కలు తీవ్రంగా గాయపరిచాయని, బాలుడు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని స్థానికులు పరుగెత్తుకొచ్చిన కుక్కలను తరిమికొట్టామన్నారు.
అప్పటికే బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. శరీరంలోని పలు భాగాల్లో కుక్కలు కరిచినట్లు సమాచారం. స్థానికులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం, లోతైన గాయాల కారణంగా వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ దాడి కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
వీధికుక్కల నియంత్రణ విషయంలో జీహెచ్ఎంసీ విఫలమైందంటూ స్థానికులు విమర్శిస్తున్నారు.
నగరంలోని అనేక ప్రాంతాల్లో వీధికుక్కల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, చిన్నపిల్లలు, వృద్ధులు బయట తిరగడానికి భయపడుతున్నారని చెబుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని వారు తెలిపారు.





