తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తన సోదరుడు, బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో పలు సామాజిక సంఘాల నేతలతో సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో కవిత మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కేటీఆర్ వైఖరిపై ఆమె నేరుగా ప్రశ్నలు కురిపించడం గమనార్హం. “పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎందుకు ప్రజల్లోకి పోలేదు? ఇప్పుడు పాదయాత్రలు చేస్తానంటే ఎవరు నమ్ముతారు?” అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై కూడా చర్చలకు దారి తీస్తున్నాయి.
కేటీఆర్ పాదయాత్ర ప్రస్తావనను కవిత ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజల సమస్యలను పట్టించుకోని నాయకులు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ప్రజలతో సంబంధం కోల్పోయిన తర్వాత తిరిగి వారిని చేరుకునే ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందని ఆమె సందేహాన్ని వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పలు సామాజిక సంఘాల నాయకులు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత పొందాయి.
ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కేటీఆర్ లేదా ఇతర పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలకు ప్రత్యుత్తరం ఇస్తారా ఇవ్వారా.. అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. ఈ పరిణామం బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలకు సంకేతమా లేక సాధారణ రాజకీయ విమర్శలలో భాగమా అన్నది కూడా ప్రశ్నగా నిలిచింది.
బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తనతో తనతో టచ్లో ఉన్నారని, సమయం వచ్చినప్పుడు వారి పేర్లు బయటపెడతానని కవిత బాంబు పేల్చారు. గ్రహగతులు అనుకూలించాలని, ఏదైనా శని అడ్డు ఉంటే తొలగిపోవాలని వారణాసిలో పూజలు చేసినట్లు కూడా ఆమె వెల్లడించారు.





