రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లలో తాగు నీటి సౌకర్యం, అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్ల ఏర్పాటు చేయాలన్నారు.
అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు, వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు హాస్పిటళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఉన్నతాధికారులతో మంత్రి బుధవారం సమీక్ష చేశారు.
హైదరాబాద్ జూబ్లిహిల్స్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ, డాక్టర్ గౌరవ్ ఉప్పల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎండా కాలం నేపథ్యంలో వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు తీసుకుంటున్న చర్యలను, హాస్పిటళ్లలో అవుట్ పేషెంట్, ఇన్పేషెంట్ల కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు మంత్రికి వివరించారు. వడ దెబ్బ బాధితులకు తక్షణమే చికిత్స అందించేందుకు అన్ని హాస్పిటల్స్లో ఇప్పటికే ఏర్పాట్లు చేశామని, మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, వారి అటెండెంట్లకు, హాస్పిటల్ సిబ్బందికి తాగు నీరు అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.
పెద్ద హాస్పిటల్స్లో ప్రతి బ్లాక్లో, ప్రతి ఫ్లోర్లో డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటల్ ఆవరణలో అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు రిపేర్ ఉంటే వెంటనే చేయించాలని ఆదేశించారు. అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలన్నారు.





