రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మత్స్యకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి వారి హక్కులను కాలరాసిందని, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో మత్స్య రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద మాట్లాడుతూ అచ్చెన్నాయుడు, మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. గత ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన రూ.128 కోట్ల నిధులను సక్రమంగా వినియోగించకుండా పక్కదారి పట్టించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆ బకాయిలను చెల్లించి కేంద్రంతో సమన్వయం సాధించామని తెలిపారు.
మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో అందించే భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచినట్లు మంత్రి తెలిపారు. ఈ నిర్ణయంతో లక్షలాది కుటుంబాలకు నేరుగా ఆర్థిక భరోసా కలిగిందని పేర్కొన్నారు. ఒకే సంవత్సరంలో రూ.242 కోట్లకు పైగా సహాయం అందించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు.
అలాగే డీజిల్ సబ్సిడీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, లీటరుకు రూ.9 సబ్సిడీతో వేలాది పడవలకు లాభం చేకూరుతున్నదని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీల కంటే మెరుగైన సహాయం అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
మత్స్యకారుల ప్రమాద మరణ పరిహారాలను కూడా పెంచామని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను క్లియర్ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేశామని మంత్రి తెలిపారు. 2024-25లో రూ.3.15 కోట్లు, 2025-26లో రూ.5.65 కోట్లు చెల్లించామని వివరించారు. సామాజిక భద్రతా పింఛన్ను రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచి ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేశామని చెప్పారు.
మత్స్య రంగ అభివృద్ధికి ట్రాన్స్పాండర్లు, కృత్రిమ రీఫ్లు, చేప పిల్లల విడుదల, డీప్ సీ ఫిషింగ్ పడవల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తీర ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణంతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో మొత్తం రూ.3,328 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి జరుగుతోందని మంత్రి వెల్లడించారు. జువ్వలదిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం వంటి హార్బర్లు నిర్మాణ దశలో ఉండగా, మరికొన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యమయ్యాయని విమర్శించారు.
మత్స్యకారుల అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని తీవ్రంగా విమర్శించిన అచ్చెన్నాయుడు, కూటమి ప్రభుత్వం పారదర్శకతతో పని చేస్తోందని స్పష్టం చేశారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం గత ప్రభుత్వానికి అలవాటైపోయిందని ఆరోపించారు.





