మాన్య ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో వైద్యారోగ్య శాఖ “హెల్త్ ఏటీఎం”లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితులకు, రిపోర్టుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన ఇబ్బందులకు త్వరలో ముగింపు పలికేలా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.
ఈ వినూత్న సాంకేతిక యంత్రాల ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే దాదాపు 130 రకాల వైద్య పరీక్షలను నిర్వహించవచ్చు. ముఖ్యంగా రక్తపోటు, చక్కెర స్థాయిలు, హీమోగ్లోబిన్, హృదయ సంబంధిత పరీక్షలు వంటి అనేక కీలక పరీక్షలు ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా తక్షణమే చేయవచ్చు. సాధారణంగా ఈ పరీక్షల కోసం ప్రజలు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఈ యంత్రాల ద్వారా ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందించబడనున్నాయి.
హైదరాబాద్ నగరంలోని కింగ్ కోఠి, మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే ఈ ప్రాజెక్టును పైలట్ దశలో భాగంగా అమలు చేశారు. అక్కడ ఈ హెల్త్ ఏటీఎంల పనితీరు అధికారులను ఆకట్టుకుంది. తక్కువ సమయంలో ఖచ్చితమైన ఫలితాలు అందించడం ద్వారా రోగులు, వైద్యులు రెండింటికీ ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా మారిందని వైద్యులు తెలిపారు.
ఈ యంత్రాల ద్వారా పొందిన పరీక్ష ఫలితాలను టీ-డయాగ్నోస్టిక్స్, ప్రముఖ ప్రైవేట్ ల్యాబ్ల ఫలితాలతో పోల్చి పరిశీలించగా, వాటిలో సమానంగా రిజ్జల్టు రావడంతో ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే జిల్లాల స్థాయిలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ యంత్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా అత్యాధునిక వైద్య సేవలకు చేరువ కానున్నారు. దూర ప్రాంతాల నుంచి నగరాలకు రావాల్సిన అవసరం లేకుండా స్థానికంగా పరీక్షలు చేయించుకునే అవకాశం కలుగుతుంది. ఇది ఆరోగ్య సేవల్లో సమానత్వాన్ని పెంచే కీలక అడుగుగా భావిస్తున్నారు.
ఈ యంత్రాలు డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా పనిచేయడం వల్ల పరీక్షల రికార్డులు సురక్షితంగా భద్రపరచబడతాయి. భవిష్యత్తులో వైద్యులు రోగుల ఆరోగ్య చరిత్రను సులభంగా పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. టెలీమెడిసిన్ సేవలతో అనుసంధానం చేయడం ద్వారా మరింత మెరుగైన చికిత్స అందించే అవకాశముంది.
ప్రస్తుతం ప్రజలలో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరుగుతోంది. తక్కువ సమయంలో, ఉచితంగా, ఖచ్చితమైన పరీక్షలు అందించడం వల్ల ఇది పెద్ద మార్పుకు దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసాన్ని పెంచడంలో కూడా ఇది కీలక పాత్ర పోషించనుంది.





