అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి ప్రాణాల కోసం మానవతా పిలుపు వెలువడింది. చిన్నారికి అత్యవసర చికిత్స కోసం సుమారు రూ.16 కోట్లు అవసరం కావడంతో కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడింది.
విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.. చిన్నారి వైద్యం నిమిత్తం ప్రజలు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి గ్రామానికి చెందిన నటరాజ్ దంపతుల కుమారుడు కేయాన్స్ అడ్విక్ (2.5 సంవత్సరాలు) స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA టైప్ 2) అనే అరుదైన వ్యాధితో గత 21 నెలలుగా పోరాడుతున్నాడు.
బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రి డాక్టర్లు చిన్నారికి ఈ వ్యాధి ఉందని తెలియజేశారు. ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధి కావడంతో సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాపాయం తప్పదని వైద్యులు హెచ్చరించారు.
చిన్నారి ప్రాణాలను నిలబెట్టడానికి అవసరమైనది AVXS-101 (ఒనసెమ్నోజీన్ అబెపార్వోవెక్) అనే అత్యంత ఖరీదైన జీవరక్షక ఇంజెక్షన్. ఈ మందు ఒక్కసారి మాత్రమే ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, దీని ధర అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా ఉందని దాని కోసం సుమారు రూ.16 కోట్ల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు తల్లిదండ్రులకు తెలిపారు.
చిన్నారికి ఇంజక్షన్ ఇప్పించే స్తోమత లేదని తల్లిదండ్రులు సహాయం కోసం చేతులు చాపారు. ప్రజాప్రతి నిధులను, దాతలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల హిందూపురం పర్యటనలో ఉన్న బాలకృష్ణను కలిసిన చిన్నారి కుటుంబ సభ్యులు తమ పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన ఆయన భావోద్వేగానికి లోనై, తన వంతుగా ఆర్థిక సహాయం చేస్తానని, అలాగే ప్రభుత్వం తరఫున కూడా అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ చిన్నారి ప్రాణాలు కాపాడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
SMA టైప్–2 వంటి వ్యాధుల్లో ముందస్తు చికిత్స అత్యంత కీలకం. సమయానికి సరైన మందు అందితే చిన్నారి ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉంటాయని వారు చెబుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియా లో వేగంగా వ్యాపిస్తోంది. పలువురు ప్రజలు, అభిమానులు చిన్నారికి సహాయం చేయాలని పిలుపునిస్తున్నారు. పలు సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.





