మహిళల ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడానికి, స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్న మహిళలకు మార్కెటింగ్ రంగంలో కొత్త అవకాశాలను కల్పించే దిశగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మరియు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చొరవతో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
శనివారం నాడు నగరంలోని ఎంజీ రోడ్డులోని ఎల్ఈపీఎల్ సెంట్రో షాపింగ్ మాల్లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. స్థానికంగా తయారు చేస్తున్న హస్తకళా ఉత్పత్తులు, ఇతర స్వయం ఉపాధి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అందించేందుకు షాపింగ్ మాల్స్లో ప్రత్యేక స్థలాలను కేటాయించడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యం.
ఈ కార్యక్రమంలో అయిదుగురు మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకంగా స్టాళ్లను కేటాయించి, వారి ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేయడానికి అవకాశాన్ని కల్పించారు. కలెక్టర్లు లక్ష్మీశ్, డీకే బాలాజీ పాల్గొని, మహిళలు ఈ అవకాసాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాలను విజయవంతంగా ముందుకు నడిపించుకోవాలని సూచించారు.
కలెక్టర్ లక్ష్మీశ్ చెప్పారు, “స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసుకోవచ్చు. మధ్యవర్తుల అవసరం తగ్గడంతో అధిక ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఆధునిక మార్కెటింగ్ పద్ధతులు, ప్యాకేజింగ్, బ్రాండింగ్ వంటి అంశాలపై మార్గదర్శకత్వం కూడా అందిస్తున్నాం.”
సామాజిక బాధ్యతగా ఎల్ఈపీఎల్ సంస్థ ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు అందించడం విశేషం. రైజ్ కేంద్రం ద్వారా ఇప్పటికే వివిధ శిక్షణ కార్యక్రమాలు, వర్క్షాప్లు నిర్వహించగా, ఇప్పుడు మార్కెటింగ్ పరంగా కూడా చేయూతనిస్తూ ఉన్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు, “మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెట్ లింకేజీలు కల్పించడం ద్వారా స్థిరమైన ఆదాయం సాధ్యమవుతుంది. ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి సామాజిక బాధ్యతగా తోడ్పడే ఇలాంటి చేయూత వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. భవిష్యత్తు తరాలకు సృజనాత్మక సంపదను వారసత్వంగా అందించాల్సిన అవసరం ఉంది.”
ఈ కార్యక్రమంలో ఎల్ఈపీఎల్ సీఈవో కె.కృష్ణకుమార్, ఎన్టీఆర్ జిల్లా డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, కృష్ణా డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాథ్, యూసీడీ పీవో ఎం.విజయలక్ష్మి, డీఆర్డీఏ, మెప్మా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.





