వనపర్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అధిష్ఠానం తగిన చర్యలు తీసుకోకపోతే గాంధీ భవన్ను ముట్టడించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
వనపర్తి జిల్లా గోపాల్పేటలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఈ వివాదానికి కేంద్రంగా మారింది. అక్కడ జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చిన్నారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పనితీరును లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక కాంగ్రెస్లో ఇప్పటికే ఉన్న విభేదాలను మరింత పెంచినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన సహనం నశిస్తే మరో ‘జీవన్రెడ్డి’ తరహా తిరుగుబాటు చేస్తానని చిన్నారెడ్డి హెచ్చరించినట్లు సమాచారం.
ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి చిన్నారెడ్డి తనను లక్ష్యంగా చేసుకుని వరుసగా విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ కార్యక్రమాల్లోనే బహిరంగంగా తనపై ఆరోపణలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. చిన్నారెడ్డి వ్యవహారశైలిపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని మేఘారెడ్డి స్పష్టం చేశారు.
చిన్నారెడ్డిపై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే గాంధీ భవన్ను ముట్టడించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. తనపై జరుగుతున్న విమర్శలను ఇకపై సహించేది లేదని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తాను చేస్తున్న కృషిని దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకుంటానని మేఘారెడ్డి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. వనపర్తి కాంగ్రెస్లో నేతల మధ్య విభేదాలు కొత్తవి కావని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీలో కీలక నేతలుగా ఉన్న ఇద్దరి మధ్య బహిరంగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు రావడం పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారింది. నియోజకవర్గ స్థాయిలో నేతల మధ్య సమన్వయం లేకపోతే పార్టీ కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే స్థానికంగా వర్గ విభేదాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో తాజా పరిణామాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు చిన్నారెడ్డి చేసిన ఆరోపణలు, మేఘారెడ్డి చేసిన ప్రత్యారోపణలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరువర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు పార్టీ పెద్దలు జోక్యం చేసుకుంటారా? లేక బహిరంగ విమర్శలకు పాల్పడిన నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? అనే చర్చ సాగుతోంది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సొంత నేతల మధ్య విభేదాలు బహిరంగం కావడం కాంగ్రెస్ నాయకత్వానికి రాజకీయంగా ఇబ్బందికర అంశంగా మారే అవకాశం ఉంది.





