సి. జోసెఫ్ విజయ్ అనబడే నేను..

Must read

తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రక మలుపు తిరిగింది. సినీ రంగంలో అపార ప్రజాదరణ సంపాదించిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత సి. జోసెఫ్ విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నో సంవత్సరాలుగా ద్రావిడ పార్టీల ఆధిపత్యంలో కొనసాగుతున్న తమిళ రాజకీయాల్లో ఈ పరిణామం ఒక కొత్త రాజకీయ యుగానికి నాంది పలికినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఉదయం 10 గంటలకు అత్యంత వైభవంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం తమిళనాడు రాజకీయ చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.

దాదాపు 59 సంవత్సరాల తర్వాత తమిళనాడులో ఒక ద్రావిడేతర నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషంగా మారింది. ఇప్పటి వరకు తమిళ రాజకీయాల్లో డీఎంకే, అన్నాడీఎంకే వంటి ద్రావిడ పార్టీలే ప్రధాన పాత్ర పోషించాయి. అయితే ప్రజల్లో విపరీతమైన ఆదరణ కలిగిన విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చివేశారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హాజరుకావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, పార్టీ సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఈ ప్రమాణ స్వీకారం రాజకీయ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచింది. అలాగే సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొని విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తుండటాన్ని వారు భావోద్వేగంతో వీక్షించారు. కార్యక్రమానికి ముందు విజయ్ తన మంత్రివర్గ సహచరులను గవర్నర్‌కు పరిచయం చేశారు. అనంతరం మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అద్భుత ఫలితాలు సాధించింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన పార్టీ 108 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యువత, మధ్యతరగతి, సినీ అభిమానులు పెద్దఎత్తున టీవీకేకు మద్దతు తెలపడం విజయానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

అధికార ఏర్పాటు కోసం కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పలు మిత్రపక్షాలు టీవీకేకు మద్దతు ప్రకటించాయి. మొత్తం 234 సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల బలంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ కూటమి తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా భారీగా ఆకట్టుకున్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యా రంగ సంస్కరణలు, అవినీతి నిర్మూలన, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో టీవీకేకు వచ్చిన ఆదరణ పార్టీ విజయానికి కీలకంగా మారింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!