తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో భూవివాదం రక్తపాతం సృష్టించింది. అన్యాయంగా ఓ ప్రాణాన్ని బలిగొంది. పాత కక్షలు, భూమి విషయంలో కొనసాగుతున్న విభేదాలు చివరకు దారుణ హత్యకు దారితీశాయి. ఈ ఘటన అనంతరం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
వివరాల్లోకి వెళితే, తిరుపతి గ్రామీణ మండలం అడపారెడ్డి పల్లి గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి (45), అదే గ్రామానికి చెందిన బొమ్మి రాహుల్ రెడ్డి మధ్య చాలా కాలంగా భూవివాదం కొనసాగుతోంది. ఈ వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. గురువారం ఈ విభేదాలు మళ్లీ తలెత్తి ఘర్షణకు దారితీశాయి.
ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన రాహుల్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిపై కత్తితో దాడి చేసి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
అమర్నాథ్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులు, గ్రామస్థులు రాహుల్ రెడ్డి ఆగ్రహానికి లోనయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో ప్రతీకార చర్యలకు దిగిన మృతుడి బంధువులు నిందితుడు రాహుల్ రెడ్డి ఇంటిపై దాడి చేసి నిప్పు అంటించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పెరిగింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం కనిపించడంతో పోలీసులు భారీగా మోహరించారు. అల్లర్లు పెరగకుండా అదుపు చర్యలు చేపట్టారు.
పోలీసులు గ్రామంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసి, ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నాం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తూ, నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
హత్య అనంతరం రాహుల్ రెడ్డి కుటుంబంతో సహా పరారైనట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితున్ని గాలిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా తగిన చర్యలు తీసుకున్నారు.





