తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, మే 4 నుండి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రైతు వారం” కార్యక్రమాలు ఘన విజయవంతంగా కొనసాగుతున్నాయి.
వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖల సమన్వయంతో రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, శాస్త్రీయ వ్యవసాయం, మార్కెటింగ్, యాంత్రీకరణ, పశుసంవర్ధక, నీటిపారుదల అంశాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.
మే 4న వికారాబాద్ జిల్లా తాండూరులో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు వారం కార్యక్రమాలను ప్రారంభించారు, సేంద్రియ రైతులు పండించిన పంటల ఉత్పత్తులను క్రయవిక్రయాల కోసం తెలంగాణ రాష్ట్ర విత్తన మరియు సేంద్రీయ ధ్రువీకరణ అధారిటీ డెవలప్ చేసిన టీజీ ఆర్గానిక్స్ మొబైల్ యాప్ గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించబడింది.
రాష్ట్రవ్యాప్తంగా 14,565 మట్టి నమూనాలను సేకరించి, 20,734 మట్టి విశ్లేషణ పత్రాలను రైతులకు అందజేశారు. నానో ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, సన్న వరి సాగు వంటి అంశాలపై రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో 1,32,423 మంది రైతులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
మే 5న హనుమకొండలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ ఆధ్వర్యంలో మెగా రైతు మేళా నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, ముఖ్యంగా ఆయిల్ పామ్, నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగుపై రైతులకు శిక్షణ ఇచ్చారు. బిందు సేద్యం, నీటి పొదుపు సాంకేతికతల వినియోగంపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
మే 8న నిర్వహించిన మండల స్థాయి సమావేశాల్లో పశుసంవర్ధక, మత్స్య, నీటిపారుదల శాఖల అధికారులు రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వేసవిలో పశువుల సంరక్షణ, పచ్చిగడ్డి సాగు, చెరువుల నిర్వహణ, చేపల ఉత్పత్తి పెంపు, కాలువల మరమ్మతులు, గేట్ల నిర్వహణ వంటి అంశాలపై కార్యాచరణ వివరించారు. రైతు వారం కార్యక్రమాల ద్వారా రైతుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించి, వ్యవసాయ ఖర్చులు తగ్గించి, దిగుబడులు మరియు ఆదాయాలు పెంచడం ద్వారా తెలంగాణ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శన స్టాళ్లను తిలకించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మాత్యులతో పాటుగా మంత్రులు కొండా సురేఖ ఎంపీ కావ్య శాసనసభ్యులు శ్రీహరి వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ ఐ.ఏ.ఎస్, డా.బి. గోపి ఐ.ఏ.ఎస్ వ్యవసాయ సంచాలకులు వ్యవసాయ శాఖ .ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.





