శ్రీకాకుళం జిల్లా ప్రజల దశాబ్దాల నాటి కోరిక ఫైనల్ గా నెరవేరింది. జిల్లా చరిత్రలో తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికు నేరుగా వెళ్లే రెగ్యులర్ రైలు సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఘట్టం జిల్లాలో చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది.
శ్రీకాకుళం రోడ్ తిరుపతి హంసఫర్ ఎక్స్ ప్రెస్ (17439/40) రైలును కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రాంమోహన్ నాయుడు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజని అభివర్ణించారు.
ఈ రైలు సేవ ద్వారా అరసవల్లిలోని అరసవెల్లి సూర్య నారాయనా దేవాలయం, మతిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం మధ్య నేరుగా అనుసంధానం ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు. ఈ రెండు దైవ క్షేత్రాలు భక్తులకు ఎంతో ప్రాముఖ్యత కలిగినవని, దీంతో భక్తులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని తెలిపారు.
రైలు ప్రారంబోత్సవ సమయంలో ప్రయాణికులతో మాట్లాడినప్పుడు వారి ముఖాల్లో సంతోషం కనిపించిందని దాంతో తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన
తెలిపారు. ఇంతకాలం పలుమార్లు మార్గమధ్యంలో రైళ్లు మారాల్సి వచ్చేది, ఇప్పుడు నేరుగా ప్రయాణం సాధ్యమవడం గొప్ప విషయం అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రైలు సాధారణ ప్రయాణికులకు కూడా ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని, ఉద్యోగాలు, విద్య, వ్యాపార అవసరాల కోసం ప్రయాణించే వారికి ఇది సౌకర్యవంతమైన మార్గంగా మారనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఆయన తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. ఇది కేవలం ఒక రైలు మాత్రమే కాదని, శ్రీకాకుళం ప్రజల ఆశలు, ఆకాంక్షలను అభివృద్ధికి అనుసంధానించే కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.





