సూపర్ స్టార్ రజినీ కాంత్ తన జీవితంలో ఎదురైన ఒక మరపురాని ఆధ్యాత్మిక అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం 45వ వార్షికోత్సవం, అలాగే ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ సమక్షంలో మాట్లాడిన రజనీకాంత్ తనకు ఆశ్రమంలో ఎదురైన అనుభవాన్ని ఎంతో సరదాగా, భావోద్వేగంగా వివరించారు. తాను తొలిసారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రశాంత వాతావరణం తనను పూర్తిగా ఆకట్టుకుందని చెప్పారు. చుట్టూ పచ్చని ప్రకృతి, సరస్సులు, ప్రశాంతంగా సంచరిస్తున్న జంతువులు, చిరునవ్వులతో కనిపించే ప్రజలను చూసి తనకు ప్రత్యేకమైన అనుభూతి కలిగిందన్నారు.
“ఆశ్రమంలో ప్రతి ఒక్కరూ ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా కనిపించారు. అక్కడ ఏనుగులు, గుర్రాలు, వందలాది ఆవులు కూడా ఉన్నాయి. వాటిలో ఒక గుర్రానికి ‘రజనీ’ అని పేరు పెట్టారని తెలిసి నేను ఆశ్చర్యపోయాను” అని ఆయన చెప్పగానే సభలో నవ్వులు వెల్లువెత్తాయి. తన పేరు ఒక గుర్రానికి పెట్టారని తెలిసి మొదట ఆశ్చర్యపోయానని, తర్వాత అది తనకు సరదా అనుభూతిని కలిగించిందని తెలిపారు.
“నేను మొదట అక్కడికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉండాలని అనుకున్నాను. కానీ ఆ వాతావరణం నన్ను అంతగా ఆకర్షించడంతో చివరకు 15 రోజులు అక్కడే ఉండిపోయాను” అని ఆయన తెలిపారు. ఆశ్రమంలోని ఆధ్యాత్మిక శక్తి, ప్రశాంతత తనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయని పేర్కొన్నారు.
తన సినీ జీవితం వల్ల వచ్చిన స్టార్డమ్, అభిమానుల ప్రేమ ఎంత ఉన్నప్పటికీ, ఆధ్యాత్మికత ముందు అవన్నీ చాలా చిన్నవిగా అనిపించాయని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఆశ్రమంలో గడిపిన రోజులు తనలోని అహాన్ని తగ్గించాయని, జీవితాన్ని మరో కోణంలో చూడడం నేర్పించాయని చెప్పారు. మనిషి ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, చివరికి అంతర్ముఖ ప్రశాంతతే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
రజనీకాంత్ ఎప్పటినుంచో ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. షూటింగ్ల మధ్యలో కూడా హిమాలయాలకు వెళ్లడం, ధ్యానం చేయడం, వివిధ ఆశ్రమాలను సందర్శించడం ఆయనకు అలవాటుగా మారింది. తన వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మికత ఎంతో ముఖ్యమైన భాగమని ఆయన పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం గురించి చేసిన వ్యాఖ్యలు కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
కార్యక్రమంలో పాల్గొన్నవారు రజనీకాంత్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఆయన మాట్లాడిన సరళి, హాస్యం, ఆధ్యాత్మికతపై వ్యక్తపరిచిన భావాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “స్టార్డమ్ కంటే మనశ్శాంతి గొప్పది” అనే సందేశం అభిమానులను ఆలోచింపజేసింది.





