భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ప్రత్యేకంగా గడిపారు. నగరానికి జీవనాడిగా భావించే హుగ్లీ నదిలో ఆయన పడవ ప్రయాణం చేయడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మమేకమై అప్యాతతో పలుకరించారు.
ఈ బోట్ రైడ్ సందర్భంగా మోదీ, పడవ నడిపే వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. అలాగే, నది తీరంలో మార్నింగ్ వాక్కు వచ్చిన ప్రజలతో కూడా పలకరించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ అనూహ్య సందర్శనతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పంచుకున్నారు. హుగ్లీ నదిలో విహరిస్తూ, కెమెరా చేతబట్టి నది అందాలను ఆయన స్వయంగా చిత్రీకరించడం ఆసక్తికరంగా మారింది. ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ ఆయన గడిపిన ఈ క్షణాలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
మోదీ తన సందేశంలో హుగ్లీ నది బెంగాల్ సంస్కృతిలో కీలక భాగమని పేర్కొన్నారు. గంగానదికి చెందిన ఈ ప్రవాహం, బెంగాలీల జీవితాల్లో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉందని తెలిపారు. ఈ నది జలాలు ఒక ప్రాచీన నాగరికత స్ఫూర్తిని మోసుకెళ్తున్నాయని ఆయన అభివర్ణించారు.
“ఈ ఉదయం కొద్దిసేపు హుగ్లీ నది తీరంలో గడపడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది” అని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. స్థానికులతో జరిగిన సంభాషణలు తనకు సంతోషాన్ని ఇచ్చాయని తెలిపారు.
ప్రత్యేకంగా పడవ నడిపే వారి శ్రమను మోదీ ప్రశంసించారు. ప్రతిరోజూ కష్టపడి తమ జీవనోపాధిని కొనసాగిస్తున్న ఈ వర్గాల కృషి సమాజానికి ఎంతో అవసరమన్నారు. వారి జీవన విధానం, పట్టుదల తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు.
ఈ సందర్శన పశ్చిమ బెంగాల్లో రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో ప్రధాని ఈ పర్యటనపై ప్రత్యేక దృష్టి పడింది.





