చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. చెత్త ద్వారా విద్యుత్తు తయారీ అనేది ఇంధన మార్గాలకు ప్రత్యమ్నాయంగా, పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. ఒక క్రమపద్ధతిలో చెత్తను సేకరిస్తే, దాని వినియోగం ద్వారా అద్భుతాలు చేయవచ్చ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును శనివారం ఆయనసందర్శించారు.
చెత్త నుంచి విద్యుత్తు తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించి, వివరాలను తెలుసుకున్నారు. చెత్తను ఎలా వేరు చేస్తారు. దాన్ని ప్లాంట్లో ఎలా శుద్ధి చేస్తారు? దేనికి ఉపయోగిస్తారనే విషయాలను ప్లాంటు అధికారులు వివరించారు. ముఖ్యంగా చెత్తను బాయిలర్లలో మండించడం ద్వారా విద్యుత్తు తయారీ ఎలా జరుగుతుందో, చివరికి బూడిదను ఇటుకల తయారీకి ఎలా వినియోగించుకోవచ్చో అధికారులు క్షుణ్నంగాపవన్ కళ్యాణ్ కి తెలిపారు.
ఈ సందర్భంగా ప్లాంటు పరిశీలన తర్వాత పూర్తి వివరాలను, ఆంధ్రప్రదేశ్ కు చెత్త సేకరణ విషయంలో ఉన్న అవకాశాలను జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు ఆపరేషన్స్ హెడ్ శ్రీఎం.వి.చారి వివరించారు. ఆయన దీనిపై ప్రత్యేకంగా ఓ నివేదిక తయారు చేశానని చెప్పడంతో పూర్తి ప్రజెంటేషన్ ఇచ్చేలా ప్రత్యేక సమయాన్ని పవన్ కళ్యాణ్ కేటాయించారు.
ఈ సందర్భంగా ప్లాంటు మొత్తం తిరుగుతూ కీలక అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడూతూ “రాష్ట్రంలో రోజువారీగా 7,200 టన్నుల పొడి చెత్త ఉత్పత్తి అవుతోంది. కొండవీడు జిందాల్ ప్లాంటు సామర్థ్యం రోజువారీ 1,400 టన్నుల పొడి చెత్తను ప్రాసెస్ చేసి, సగటున 20 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. దాన్ని రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ తో అనుసంధానం చేసి, రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చగలదు.
విశాఖపట్నంలోనూ జిందాల్ ప్లాంటు ఉత్తరాంధ్ర రీజియన్ చెత్తను సేకరించి 15 మెగావాట్లు విద్యుత్తు ఉత్పాదన చేస్తోంది. ఈ తరహా ప్లాంట్లు రాష్ట్రంలో త్వరలో మరో 6 ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనిలో కాకినాడలో ఇప్పటికే పనులు మొదలు కాగా, నెల్లూరు, కడప కర్నూలు, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో కూడా త్వరలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది.
పంచాయతీల్లో చెత్త నిర్వహణకు సంబంధించి క్లస్టర్ల వారీగా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలి. ప్లాంట్లకు చెత్త ఎలా అవసరం అవుతుంది..? దాన్ని ఎలా వేరు చేయాలి..? సేకరించిన చెత్త ద్వారా పంచాయతీలు ఆదాయం ఎలా పొందవచ్చనే అంశాలను, డంపింగ్ యార్డ్ లు లేని పంచాయతీలను సాకారం చేసేందుకు వర్క్ షాపులను నిర్వహించేలా చూడాలి’ అని ఆయన స్పష్టం చేశారు.





