మంత్రి నారా లోకేశ్ ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్న సమయంలో వాటిని అడ్డుకోవడం సరైంది కాదని హితువు పలికారు. ఈ మేరకు లోకేశ్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు.
రాష్ట్రానికి మేలు చేసే కంపెనీలు వస్తుంటే వాటిని స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా దేశ రక్షణ రంగానికి ఉపయోగపడే ఆధునాతన బోట్లు తయారు చేసే సంస్థ రాష్ట్రానికి వస్తుండగా, దాన్ని అడ్డుకోవాలనుకోడం బాధాకరమన్నారు. ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు రావడం రాష్ట్రానికి గౌరవకరమని, అలాగే ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందన్నారు.
ఈ సంస్థ ద్వారా స్థానిక యువతకు, ముఖ్యంగా మత్స్యకారుల కుటుంబాలకు చెందిన పిల్లలకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేశ్ వివరించారు. వెయ్యికి పైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడం సమంజసం కాదన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది ఒక మంచి అవకాశమని, అలాంటి అవకాశాలను అడ్డుకోవడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు.
ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని లోకేశ్ సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాల్సింది పోయి, రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ లాభాలకే ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు.
పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా పెట్టుబడులు పెరగడంతో పాటు, ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని లోకేశ్ తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుండగా, అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో రెండు వర్గాల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.





