సుమతి మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మరోసారి స్పష్టం చేశారు. సాధారణ మహిళలా వేషం వేసుకుని అర్ధరాత్రి రోడ్లపై స్వయంగా నిలబడి నిర్వహించిన ప్రత్యేక డెకాయ్ ఆపరేషన్తో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల అసలు రూపాన్ని బయటపెట్టారు.
దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల వరకు కొనసాగిన ఈ ప్రత్యేక ఆపరేషన్లో సీపీ సుమతి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. సాధారణ మహిళగా రోడ్డుపై నిలబడి పరిస్థితులను గమనించిన ఆమెను లక్ష్యంగా చేసుకుని కొందరు ఆకతాయిలు అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, వేధింపులకు పాల్పడడం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.“వస్తావా? రేటెంత?” వంటి అసభ్య పదజాలంతో మహిళలను అవమానించేలా ప్రవర్తించిన యువకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా పోలీస్ శాఖ గట్టి హెచ్చరిక పంపింది. ఈ ఆపరేషన్లో మొత్తం 40 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఉద్యోగార్థులు ఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
సమాజంలో మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు కేవలం చట్టాలు సరిపోవని, కఠిన అమలు కూడా అవసరమని ఈ ఆపరేషన్ స్పష్టం చేసింది. రాత్రివేళ మహిళలు ఎదుర్కొనే భయానక పరిస్థితులను ప్రత్యక్షంగా అర్థం చేసుకునేందుకు సీపీ స్వయంగా రంగంలోకి దిగడం పోలీస్ వ్యవస్థలో అరుదైన చర్యగా నిలిచింది.ఈ ఘటనతో మహిళల భద్రతపై ప్రజల్లో కొత్త చర్చ మొదలైంది. మహిళలపై అసభ్య ప్రవర్తన, ఈవ్ టీజింగ్, వేధింపులకు పాల్పడితే ఎవరైనా చట్టం ముందు తలవంచాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు.సీపీ సుమతి తీసుకున్న ఈ ధైర్య నిర్ణయం మహిళలకు భరోసానిస్తూ, సమాజానికి బలమైన సందేశం ఇచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని ఈ ఆపరేషన్ ద్వారా మరోసారి రుజువైంది.





