ఆన్లైన్ బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్ యాప్లు, లోన్ యాప్ల మోజు యువత జీవితాలను ఎలా నాశనం చేస్తుందో చెప్పే మరో సంచలన ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్లైన్ బెట్టింగ్లు, కలర్ ట్రేడింగ్ వంటి ప్లాట్ఫామ్లలో భారీ మొత్తంలో డబ్బు కోల్పోయిన ఓ డిగ్రీ విద్యార్థి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు చివరకు కిడ్నాప్, దోపిడీ, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జగిత్యాల జిల్లాకు చెందిన ధమ్మ దినేష్ రెడ్డి సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతున్నాడు. చదువుతో పాటు మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాల్సిన వయస్సులోనే అతడు ఆన్లైన్ బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్ యాప్లకు బానిసయ్యాడు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో వివిధ ఆన్లైన్ గేమింగ్, కలర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లలో వరుసగా పెట్టుబడులు పెట్టాడు. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో దాదాపు రూ.4 లక్షల వరకు నష్టపోయినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నష్టాలను భర్తీ చేసుకోవాలనే ఉద్దేశంతో అతడు పలు లోన్ యాప్ల ద్వారా రుణాలు కూడా తీసుకున్నాడు. అయితే తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించలేకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు, ఇతర రుణదాతల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. తరచూ ఫోన్ కాల్స్, డబ్బు చెల్లించాలని హెచ్చరికలు రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన దినేష్, చివరకు నేర మార్గాన్ని ఎంచుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
అప్పుల నుంచి బయటపడేందుకు పెద్ద మొత్తంలో నగదు లేదా బంగారు ఆభరణాలు దోచుకోవాలని ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్న నిందితుడు, కరీంనగర్ నగరంలోని పలు ప్రాంతాల్లో వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించాడు. ఒంటరిగా తిరిగే వ్యక్తులను గమనిస్తూ సరైన అవకాశాన్ని ఎదురుచూశాడు.ఈ క్రమంలో గంగాధర లక్ష్మి (55) అనే దినసరి కూలీ మహిళ అతడి దృష్టిలో పడింది. ఆమె ఒంటరిగా ప్రయాణించే సమయాలను గమనించిన దినేష్, ఆమెనే లక్ష్యంగా ఎంచుకుని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాడు.
జులై 1న గంగాధర లక్ష్మి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెతో మాట కలిపిన దినేష్, నమ్మకం కలిగించేలా ప్రవర్తించాడు. అనంతరం రాపిడో బైక్ను బుక్ చేసి ఆమెను తిమ్మాపూర్ వైపు తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్న తర్వాత తన సొంత ద్విచక్ర వాహనంపై ఆమెను ఎక్కించుకుని నుస్తులాపూర్ గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వైపు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
జనం రాకపోకలు తక్కువగా ఉండే ప్రాంతానికి చేరుకున్న అనంతరం మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు సుమారు 20 గ్రాముల వెండి మెట్టెలను బలవంతంగా లాక్కున్నాడు. ఘటనను ఎవరికి చెప్పకుండా ఉండేందుకు ఆమెపై హత్యాయత్నానికి కూడా పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
గంగాధర లక్ష్మి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తొలుత పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, ప్రయాణ వివరాలను విశ్లేషించిన అనంతరం ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, కిడ్నాప్, దోపిడీ, హత్యాయత్నం జరిగినట్లు గుర్తించారు.
దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. అతని వద్ద నుంచి దోచుకున్న ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను వెలికితీసేందుకు పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.





