టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట కవిత అంబేద్కర్ కు వనమాలవేసి, టిఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడున్న ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు. సొంత ఆస్తులు పెంచుకోవడం లోనే నిమగ్నమయ్యారు కానీ ప్రజల బాగోగులు ఇక్కడున్న పారిశ్రామిక కార్మికులను పట్టించుకోనే నాథుడే లేడు.
అలాగే బిజెపి ఎంపీ రఘునందన్ బిఆర్ఎస్ బిజెపిలో ఒకటేనని నిరూపించారు. ఈ ప్రాంతాన్ని ప్రేమించే కొత్త రాజకీయ శక్తి గెలవాల్సిన అవసరం ఉంది. బీజేపీని ప్రశ్నించాల్సిన మిగతా పార్టీలు సైలెంట్ ఉంటాయి. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయటాన్ని గర్వంగా భావిస్తూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా.
మన హక్కులు, ఉద్యోగాలు, వనరుల కోసం మనం బిడికిలి బిగించి కొట్లాడాలి. ఇవ్వాళ తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లు ఉన్నాయి. కొత్త పార్టీ అవసరం ఏంటనీ అడుగుతున్నారు? మూడు ప్రధాన పార్టీలు ఉన్న సరే పేద ప్రజలు చదువుకునేందుకు ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకు ఉంది? సర్కార్ స్కూళ్లలో పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు.
చదువుకుంటామని పిల్లలు అడిగితే అవకాశం కల్పించలేని పార్టీలు ఉంటే ఎంత లేకుంటే ఎంత? ఇవ్వాళ ఒక ప్రమాదం జరిగితే ప్రైవేట్ హాస్పిటల్ లో లక్షల్లో ఖర్చు అవుతుంది. ప్రభుత్వ హాస్పిటల్ లో సూది ఉంటే దూది లేని పరిస్థితి ఉంది. ఈ బాధలన్నీ ఒక తల్లి మాదిరిగా ఆలోచిస్తేనే అర్థం అవుతాయి. మీ ఆడబిడ్డగా నేను ముందుకు వచ్చా. తెలంగాణ ఆడబిడ్డల మీద నమ్మకంతో పార్టీ పెట్టాను. కచ్చితంగా మేము మార్పు తీసుకొస్తాం.
రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ వస్తే పేద బిడ్డలు జేబు చూసుకోవాల్సిన పరిస్థితి రాదని అనుకున్నాం. అందుకే మన ప్రాంతాన్ని ప్రేమించే కొత్త రాజకీయ శక్తి రావాల్సిన అవసరం ఉంది. ఉచిత విద్య, వైద్యం ప్రజలందరికీ ఇస్తానని నేను మాట ఇస్తున్నా ఆమె అన్నారు. జెండా ఆవిష్కరణకు రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ, జిల్లా అధ్యక్షుడు మాసన్నగారి బాలయ్య, పటాన్చెరు ఇంచార్జి తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి, విష్ణు వర్ధన్ చారి, ప్రవీణ్ కుమార్ మహేంద్ర, పాల్గొనడం జరిగింది.





