హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్, గోల్నాక ప్రాంతంలో మూసీ నదిలో పడిపోయిన ఓ మహిళను హైడ్రా బృందాలు కాపాడింది. రాత్రంతా మూసీలోనే చిక్కుకుని ప్రాణభయంతో గడిపిన మహిళను స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో హైడ్రా, ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. వేగంగా స్పందించిన హైడ్రా బృందం మహిళను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైడ్రా తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించింది. శనివారం ఉదయం 10.51 గంటలకు హైడ్రా కంట్రోల్ రూమ్కు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు అప్రమత్తమై, కేవలం 16 నిమిషాల్లోనే అంటే ఉదయం 11:07 గంటలకు ఘటనాస్థలికి చేరుకున్నట్లు వెల్లడించింది.
అంబర్పేట్ సమీపంలోని గోల్నాక, భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన ఇందిర (49) శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు మూసీలో జారి పడింది. ఆమె పడిన ప్రాంతం ఒడ్డుకు చేరుకునే అవకాశం లేని ప్రమాదకర ప్రాంతంగా అధికారులు తెలిపారు. అక్కడ చెట్లు, పొదలు ఎక్కువగా ఉండటంతో బయటకు రావడం అసాధ్యంగా మారింది.
రాత్రంతా మూసీలోనే చిక్కుకుని తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె సహాయం కోసం పలుమార్లు కేకలు వేసినా, ఆ సమయంలో ఎవరూ గుర్తించలేకపోయారు. శనివారం ఉదయం 10 గంటల తర్వాత స్థానికులు ఆమెను గమనించి వెంటనే సహాయక చర్యలకు ప్రయత్నించారు. అయితే ఆమె ఉన్న ప్రాంతం చాలా క్లిష్టంగా ఉండటంతో బయటకు తీయడం సాధ్యపడలేదు.
దీంతో స్థానికులు వెంటనే హైడ్రా కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. అత్యవసర సహాయ నంబర్ 90001 13667కు ఫోన్ చేసి ఘటన వివరాలు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే డీఆర్ఎఫ్ రెస్క్యూ ఇన్ఛార్జ్ స్వామి నేతృత్వంలోని టీమ్-16 అంబర్పేట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
రక్షణ చర్యలు ప్రారంభించిన హైడ్రా సిబ్బంది అత్యంత జాగ్రత్తగా మహిళను బయటకు తీసే ప్రయత్నం చేశారు. మూసీ ప్రవాహం, చెట్ల అడ్డంకులు, ప్రమాదకర పరిస్థితుల మధ్య రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఈ సమయంలో ఫైర్ సిబ్బంది కూడా అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ ద్వారా మహిళను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆమెకు ప్రాథమిక చికిత్స అందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
హైడ్రా బృందం వేగవంతమైన స్పందనపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. సమాచారం అందిన కొద్ది నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుని మహిళ ప్రాణాలను కాపాడడం అభినందనీయమని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి.
నీటి ప్రవాహాల కారణంగా మూసీ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో నది పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే సహాయక బృందాలకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. హైడ్రా, ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు నగరంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటాయని తెలిపారు. హైడ్రా బృందం వేగవంతమైన స్పందన కలిసి ఒక మహిళ ప్రాణాలను కాపాడగలిగాయి. అంబర్పేట్లో జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం నగరవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.





