ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న “బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ” వారోత్సవాల సందర్భంగా, శుక్రవారం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని RBSK DEIC కేంద్రంలో 0–5 సంవత్సరాల పిల్లల రిస్క్ అసెస్మెంట్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. వసంతరావు, డా. శశాంక్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డి.డబ్ల్యూ.ఓ లలిత కుమారి మాట్లాడుతూ, 0–5 సంవత్సరాల పిల్లలలో ఉన్న ఆరోగ్య సమస్యలను తొందరగా గుర్తించడం చాలా కీలకమని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటా సర్వే నిర్వహించి, రిస్క్లో ఉన్న పిల్లలను గుర్తించి, వారిని RBSK మెడికల్ అధికారుల ద్వారా స్క్రీనింగ్ చేసి అవసరమైన రిఫరల్ సేవలు, ప్రత్యేక వైద్య సేవలు అందించబడతాయని తెలిపారు.
సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పిల్లలను త్వరగా సాధారణ స్థితికి తీసుకురావచ్చని ఆమె అన్నారు. డిఎంహెచ్ఓ డా.వసంతరావు మాట్లాడుతూ, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలు తమ పిల్లల్లో ఉన్న సమస్యలను గుర్తించకపోతే, భవిష్యత్తులో ప్రమాదాలకు గురయ్యే అవకాశముందని పేర్కొన్నారు.
అందుకే ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది ద్వారా ముందుగానే రిస్క్ను గుర్తించి, RBSK DEIC కేంద్రానికి తీసుకురావడం ద్వారా పూర్తి స్థాయి వైద్య సేవలు అందించవచ్చని తెలిపారు. డా. శశాంక్ మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య సేవల ద్వారా రిస్క్లో ఉన్న పిల్లలకు ఉచితంగా సర్జరీలు, ఫిజియోథెరపీ సేవలు మరియు అవసరమైన రిఫరల్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పరిసర ప్రాంతాలు, జోగిపేట మరియు సదాశివపేట ప్రాంతాల నుంచి మొత్తం 24 మంది రిస్క్లో ఉన్న పిల్లలను DEIC కేంద్రానికి రిఫర్ చేసి, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిపిఓ రత్నం, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ నవీన్ చారి, డిసిపిఎస్ సిబ్బంది లింగం, యాదగిరి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.





