ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ తెల్లవారుజామున అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడం ఆందోళనకు గురిచేసింది. బెంగళూరు పర్యటనను ముగించుకుని అర్ధరాత్రి అనంతరం విజయవాడకు చేరుకున్న ఆయన, కొద్ది గంటల వ్యవధిలోనే తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటం గమనార్హం. పరిస్థితి తీవ్రమవుతుండటంతో వెంటనే ఆయనను నగరంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో విజయవాడకు చేరుకున్నారు. అయితే ప్రయాణ అలసట నుంచి పూర్తిగా కోలుకునేలోపే తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తీవ్రమైన కడుపునొప్పి ప్రారంభమైంది. వెంటనే రాజ్భవన్ సిబ్బంది అప్రమత్తమై, అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
నిరంతర ప్రయాణం, విశ్రాంతి లేకపోవడం, విమానం ఆలస్యం కావడం వంటి కారణాలు ఈ ఆనారోగ్య సమస్యకు దారితీసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల గవర్నర్ పర్యటనలు బిజీగా ఉండటం వల్ల శారీరక అలసట పెరిగిందని కూడా సమాచారం. ఈ నేపథ్యంలో వైద్యులు పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన చికిత్స అందిస్తున్నారు.
గవర్నర్ ఆరోగ్యంపై రాజ్భవన్ వర్గాలు స్పందించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని, సాధారణ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
గవర్నర్ ఆరోగ్యంపై సమాచారం తెలిసిన వెంటనే పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఆయన ఆరోగ్యం గురించి ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం కూడా గవర్నర్ ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.





