తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవల నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించే క్రమంలో బుధవారం చెన్నైలోని ఎగ్మోర్ ప్రభుత్వ మహిళా, శిశు ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, చికిత్సా విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో చేతిలో డైరీతో నోట్లు రాసుకుంటూ కనిపించిన విజయ్, ఈ తనిఖీ సందర్భంగా కూడా అదే డైరీలో పలు అంశాలను నమోదు చేస్తూ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.జి. అరుణ్రాజ్తో పాటు ఉన్నతాధికారులు, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రిలోని ప్రసూతి, గైనకాలజీ విభాగాలు, ప్రసవానంతర వార్డులు, శిశు సంరక్షణ విభాగాలను సీఎం క్షుణ్ణంగా పరిశీలించారు. రోగుల సంఖ్య, పడకల లభ్యత, వైద్య సిబ్బంది అందుబాటు, అవసరమైన వైద్య పరికరాల పరిస్థితి వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
పరిశీలన సందర్భంగా విజయ్ రోగులు, వారి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్స, వైద్యుల సేవలు, మందుల లభ్యత, పారిశుధ్యం, ఇతర సౌకర్యాలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, ఫిర్యాదులను డైరీలో నమోదు చేస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అనంతరం వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి, విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, సిబ్బంది కొరత, మౌలిక వసతుల అవసరాలపై చర్చించారు. ఆసుపత్రికి రోజురోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే అదనపు వార్డులు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఆసుపత్రికి సంబంధించిన కొన్ని ఫిర్యాదులు, సౌకర్యాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ ఆకస్మిక తనిఖీ చేపట్టినట్లు తెలుస్తోంది. తనిఖీ సందర్భంగా సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన, పారదర్శకత, జవాబుదారీతనం, రోగులకు స్నేహపూర్వక సేవలందించడం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల ప్రమాణాలను నిరంతరం మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని విజయ్ పునరుద్ఘాటించినట్లు సమాచారం. ముఖ్యంగా తల్లులు, చిన్నారులకు అందుతున్న వైద్య సేవల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని, రోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీ నేపథ్యంలో ఆసుపత్రి పరిసరాల్లో సందడి నెలకొంది. ఆయన రాకతో రోగులు, వారి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది ఆసక్తిగా స్పందించారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రత్యక్షంగా సమీక్షిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే విధానాన్ని పలువురు అభినందిస్తుండగా, ఈ తనిఖీతో ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.





