నెల్లూరు నగరంలో రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఉన్నత ఆశయంతో, నిరుపేద, మధ్యతరగతి ప్రజల కోసం ఏర్పాటు చేసిన నారాయణ నేత్ర జ్యోతి,నారాయణ దంత సురక్ష ఉచిత మెగా హెల్త్ క్యాంప్ 49వ డివిజన్లో దిగ్విజయంగా జరుగుతుంది.
ఈ సందర్భంగా కో-క్లస్టర్ ఖాదర్ బాషా, ప్రెసిడెంట్ ప్రసాద్, వైద్యాధికారులు డాక్టర్ సుధ, రఫీ మాట్లాడుతూ… కోట్ల రూపాయల భారీ వ్యయంతో కూడిన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని నిరుపేదల ముంగిటకే తెచ్చేందుకు మంత్రి 3 కోట్ల వ్యయంతో అత్యాధునిక నారాయణ ఆన్ వీల్స్ మొబైల్ క్లినిక్ వాహనాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.
ఈ సేవా యజ్ఞంలో భాగంగా ఇప్పటివరకు నారాయణ నేత్రజ్యోతి ద్వారా 9,617 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, 5,461 మందికి పైగా ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశామని, అలాగే తీవ్రమైన దృష్టి లోపాలతో బాధపడుతున్న 143 మంది రోగులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి కంటిచూపును పునరుద్ధరించడం జరిగిందని వెల్లడించారు. దీనితో పాటు నారాయణ దంత సురక్ష విభాగంలో ఇప్పటివరకు 6,257 మందికి నాణ్యమైన దంత పరీక్షలు నిర్వహించామని వారు పేర్కొన్నారు.
గతంలో ఉచిత వైద్య శిబిరాల పట్ల ప్రజల్లో కొంత అపనమ్మకం ఉన్నప్పటికీ, ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో నిపుణులైన సీనియర్ డాక్టర్లు ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ నిశితంగా పరీక్షలు నిర్వహిస్తుండటంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి క్యాంప్లోనూ వైద్యుల ప్రత్యేక శ్రద్ధ కోసం 60 మందికి మించకుండా పరీక్షలు చేస్తున్నామని, కంప్యూటర్ కంటి పరీక్షలు చేసి కేవలం ఒకటి లేదా రెండు రోజుల్లోనే రోగులకు ఉచితంగా కళ్లద్దాలు అందిస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు.
అంతేకాకుండా మధుమేహం ఉన్నవారికి డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా వంటి సమస్యలపై అవగాహన కల్పిస్తూ అంధత్వం రాకుండా ప్రజల్లో చైతన్యం తెస్తున్నామని వివరించారు. ప్రజల ఇళ్ల వద్దకే ఈ ఉచిత సేవలు అందుతుండటంతో పేదలకు సమయం, వేలాది రూపాయల డబ్బు ఎంతో ఆదా అవుతోందని, మంచి చేయాలనే తపన ఉన్న నాయకుడు మంత్రిగా ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో చెప్పడానికి నారాయణ చొరవే నిదర్శనమని కొనియాడుతూ డివిజన్ ప్రజల తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కొక్లస్టర్ షేక్ ఖాదర్ బాషా, ప్రెసిడెంట్ బండి ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ నారా శ్రీనివాసులు, యూత్ ప్రెసిడెంట్ కరిముల్లా, యూనిట్ ఇంచార్జ్ ముజీబ్, కన్వీనర్ పవన్, మహిళా సెక్రెటరీ లక్ష్మి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.





