మెట్రో ఫేజ్-2 ఆలస్యానికి కేంద్రం కారణం కాదు: కిషన్‌రెడ్డి

Must read

హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పరిపాలనా వైఫల్యాలు, ప్రాజెక్టుల అమలులో నెలకొన్న సమస్యలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపై, తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించలేదని, పైగా అవసరమైన సహకారం అందించేందుకు ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందిస్తోందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో రైలు విస్తరణ అంశాన్ని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం సరికాదని పేర్కొన్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్-1 అమలు సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ.1,200 కోట్ల ఆర్థిక సహాయం అందించిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. నగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం ఎల్లప్పుడూ సహకరిస్తోందన్నారు. మెట్రో విస్తరణ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని తానే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసి సూచించిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు.

మెట్రో ఫేజ్-2 కోసం అవసరమైన భారీ నిధుల సమీకరణలో భాగంగా ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. సుమారు రూ.13 వేల కోట్ల రుణ ప్రతిపాదనకు సంబంధించి కొన్ని సాంకేతిక అంశాలు, విధివిధానాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని చెప్పారు. అలాంటి అంశాలను అధికారిక స్థాయిలో చర్చించి పరిష్కరించుకోవాల్సిందిపోయి వాటిని రాజకీయ రంగు పులిమి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సమంజసం కాదన్నారు.

ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక అంశాల్లో సహజంగానే కొన్ని విధానపరమైన ప్రక్రియలు ఉంటాయని, వాటిని పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం కనుగొనడం కంటే రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

హైదరాబాద్‌ నగర భవిష్యత్‌ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో విస్తరణ అత్యంత కీలకమని ఆయన చెప్పారు. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్‌ రద్దీ నేపథ్యంలో మెట్రో సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం అవసరమని పేర్కొన్నారు. ఈ లక్ష్యంతో కేంద్రం కూడా సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!