​ఓటమి భయంతోనే ‘ఫ్యూచర్ సిటీ’పై కుట్రలు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Must read

“ఓటమి చెంది, నిరాశ నిస్పృహలకు గురై, ఏదో కోల్పోయామనే భావంతో ఉన్న నాటి బీఆర్‌ఎస్ నాయకత్వం నేడు రాష్ట్ర అభివృద్ధిపై విషం చిమ్ముతోంది” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం, ప్రపంచంతో పోటీ పడటం ఇష్టం లేని కొందరు కుట్రదారులు రాష్ట్రాన్ని శపిస్తున్నారని, వారి కుట్రలను ప్రజలంతా గమనించాలని ఆయన పిలుపునిచ్చారు.

​ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న డిప్యూటీ సీఎం, అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.
​​తెలంగాణను ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని స్పష్టం చేశారు.

​”మా అభివృద్ధి ఏదో దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పోటీ పడటానికి కాదు. జపాన్, కొరియా లాంటి ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయిలో తెలంగాణను నిలబెట్టేందుకు పునాదులు వేస్తున్నాం. ఇలాంటి శుభసందర్భంలో కొందరు రాజకీయ స్వార్థంతో ఫ్యూచర్ సిటీ రాకూడదని, అభివృద్ధి జరగకూడదని అడ్డుపడుతున్నారు. ఈ రాష్ట్రం మనది.. మనమంతా చేయి చేయి కలిపి, అడుగులో అడుగు వేసి ముందుకు నడుద్దాం” అని తెలంగాణ ప్రజానీకానికి ఆయన పిలుపునిచ్చారు.

​గత ప్రభుత్వం ఈ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కాలుష్యానికి కారణమయ్యే ఫార్మా సిటీని తీసుకువచ్చి, హైదరాబాద్ మహానగరాన్ని సైతం ప్రమాదంలోకి నెట్టేసిందని భట్టి విమర్శించారు. ఆనాడు కాంగ్రెస్ పక్షాన ఇచ్చిన మాట ప్రకారమే.. నేడు కాలుష్య రహిత ‘గ్రీన్ ఫార్మా’, ‘గ్రీన్ ఎనర్జీ’ వ్యవస్థలను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

ఆనాడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలు ఎలా విలసిల్లాయో.. రాబోయే రోజుల్లో ‘ఫ్యూచర్ సిటీ’ యావత్ తెలంగాణ కీర్తి కిరీటంలో మకుటాయమానమైన మణిహారంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రపంచస్థాయి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, ఇక్కడి నిరుద్యోగ యువత కోసం ‘స్కిల్స్ యూనివర్సిటీ’, అంతర్జాతీయ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి స్థానిక రైతు కుటుంబాలకు పెద్ద ఎత్తున ఆదాయ వనరులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు.

​ఫ్యూచర్ సిటీ పరిధిలో జరుగుతున్న అపూర్వ అభివృద్ధిని చూసి, తమ గ్రామాలను కూడా ఈ అథారిటీలో చేర్చాలంటూ స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. తొలిదశగా కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కలపడానికి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారని చెప్తూ.. “ఈ ప్రాంత ప్రజల విజ్ఞప్తి మేరకు, ఆయా గ్రామాలను అథారిటీలో విలీనం చేసే ఫైలుపై ఇదే వేదిక నుంచి అధికారికంగా సంతకం చేయాలి” అని సీఎం రేవంత్ రెడ్డిని భట్టి విక్రమార్క బహిరంగంగా కోరారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!