ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు వైద్య, ఆరోగ్య శాఖలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు.
సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ప్రజారోగ్య నిపుణులు, విమానాశ్రయ అధికారులు పాల్గొని ఎబోలా వైరస్ వ్యాప్తి అవకాశాలు, నివారణ చర్యలు, అత్యవసర స్పందన వ్యవస్థలపై చర్చించారు. రాష్ట్రంలోకి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పర్యవేక్షణకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే అమల్లో ఉన్న స్క్రీనింగ్ ప్రక్రియలను మరింత కట్టుదిట్టం చేసి, ప్రతి అంతర్జాతీయ ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని సూచించారు.
విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ప్రయాణికుల ఆరోగ్య వివరాలు సేకరించడంతో పాటు, వారికి అవసరమైన సూచనలు అందజేయనున్నాయి. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించి ప్రత్యేకంగా నమోదు చేయాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరిశీలించాలని అధికారులకు సూచించారు.
ఎబోలా వైరస్ లక్షణాలు వెంటనే బయటపడకపోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభావిత దేశాల నుంచి తెలంగాణకు చేరుకునే ప్రయాణికులపై విమానాశ్రయం నుంచే 21 రోజుల పాటు కఠిన పర్యవేక్షణ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ వ్యవధిలో ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు, జ్వరం, వాంతులు, బలహీనత, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించేలా ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. జిల్లా స్థాయి వైద్య బృందాలు కూడా ఈ పర్యవేక్షణలో భాగస్వామ్యం కానున్నాయి.
విదేశీ ప్రయాణికులతో సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం శంషాబాద్ విమానాశ్రయంలో బహుభాషా సిబ్బందిని నియమించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో చాలామంది ఫ్రెంచ్, అరబిక్, స్వాహిలి భాషలు మాట్లాడే అవకాశం ఉండటంతో ఆ భాషల్లో నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
దీంతో ప్రయాణికుల నుంచి సరైన సమాచారం సేకరించడం, ఆరోగ్య సూచనలు వివరించడం, అవసరమైన మార్గదర్శకాలు అందించడం సులభతరం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.





