ఆధునిక వైద్య రంగం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో వైద్యులు నిర్వహించిన ఓ అరుదైన మెదడు శస్త్రచికిత్స ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా బ్రెయిన్ సర్జరీ అంటే రోగికి పూర్తి మత్తు ఇచ్చి శస్త్రచికిత్స నిర్వహిస్తారని ప్రజలు భావిస్తారు. అయితే గుంటూరు జిల్లా వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రిలో వైద్యులు అత్యాధునిక సాంకేతికతతో, రోగిని పూర్తిగా మెలకువలో ఉంచి మెదడులోని గడ్డను విజయవంతంగా తొలగించారు. మరింత విశేషం ఏమిటంటే, ఆ మహిళకు ఇష్టమైన నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన సినిమాను చూపిస్తూ ఈ శస్త్రచికిత్స నిర్వహించడం.
ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గనిపిశెట్టి కోటేశ్వరమ్మ తన భర్తతో కలిసి గుంటూరు జిల్లా పొన్నూరులో కిచిడీ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా ఆమెకు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. తరచూ తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపించినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల ఒక్కసారిగా మూర్ఛ వచ్చి కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే ఆమెను వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.
ఆసుపత్రిలో న్యూరో సర్జన్ డాక్టర్ పద్మనాభుని అరుణ్కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం కోటేశ్వరమ్మకు ఎంఆర్ఐ స్కాన్తో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. పరీక్షల అనంతరం ఆమె మెదడులో కీలక భాగానికి సమీపంలో గడ్డ (బ్రెయిన్ ట్యూమర్) ఉన్నట్లు గుర్తించారు. సాధారణ శస్త్రచికిత్స చేస్తే మాట్లాడే సామర్థ్యం, చేతులు కాళ్ల కదలికలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో వైద్యులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు.
ఈ నేపథ్యంలో వైద్య బృందం ‘అవేక్ క్రేనియోటమీ’ అనే అత్యాధునిక శస్త్రచికిత్స విధానాన్ని ఎంపిక చేసింది. ఈ పద్ధతిలో రోగిని పూర్తిగా మత్తులోకి పంపకుండా, మెదడుకు సంబంధించిన కొన్ని కీలక కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఆపరేషన్ సమయంలో రోగి వైద్యులతో మాట్లాడగలుగుతారు. దీంతో మెదడులోని ఏ భాగాన్ని తొలగిస్తే శరీర పనితీరుపై ప్రభావం పడుతుందో వైద్యులు ప్రత్యక్షంగా అంచనా వేయగలుగుతారు.
శస్త్రచికిత్స సమయంలో రోగి భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు వైద్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోటేశ్వరమ్మకు ఇష్టమైన నటుడు పవన్ కల్యాణ్ సినిమాను పెద్ద స్క్రీన్పై ప్రదర్శించారు. సినిమా చూస్తూ, వైద్యులతో మాట్లాడుతూనే ఆమె శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ఆపరేషన్ మొత్తం సమయంలో ఆమె స్పందనలను పరిశీలిస్తూ మెదడులోని గడ్డను అత్యంత జాగ్రత్తగా తొలగించారు.
వైద్యుల ప్రకారం, ఈ విధమైన శస్త్రచికిత్సలు ప్రపంచవ్యాప్తంగా కొద్ది ప్రత్యేక కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మెదడులో మాట్లాడే సామర్థ్యం, జ్ఞాపకశక్తి, శరీర కదలికలను నియంత్రించే ప్రాంతాల సమీపంలో ట్యూమర్లు ఉన్నప్పుడు ‘అవేక్ క్రేనియోటమీ’ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో ఆరోగ్యకరమైన మెదడు కణజాలాన్ని రక్షిస్తూ ట్యూమర్ను తొలగించే అవకాశం లభిస్తుంది.
శస్త్రచికిత్స అనంతరం కోటేశ్వరమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని తెలిపారు. సమయానికి సరైన చికిత్స అందకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేదని పేర్కొన్నారు.





