హైదరాబాద్లోని (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ)లో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో వాటర్ బోర్డ్ రెడ్ హిల్స్ విభాగం జనరల్ మేనేజర్ ఎస్.ఎల్. కుమార్కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం తెల్లవారుజామునే మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి వస్తువులు, ఆస్తి పత్రాలు బయటపడటంతో అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఏసీబీ వర్గాల ప్రకారం.. ప్రాథమిక దర్యాప్తులోనే కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల ఆనవాళ్లు బయటపడినట్లు తెలుస్తోంది.
ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టాయి. ఉదయం ప్రారంభమైన ఈ దాడులు గంటల తరబడి కొనసాగాయి. అధికారుల బృందాలు నివాస గృహాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లు, అనుమానిత ఆస్తుల వద్ద తనిఖీలు నిర్వహించాయి.
హైదరాబాద్ మల్లాపూర్లోని ఎస్.ఎల్. కుమార్ నివాసంలో అధికారులు లాకర్లు, అల్మారాలు, రహస్య గదులను పరిశీలించారు. ఈ క్రమంలో సుమారు రూ.1.10 కోట్లకు పైగా నగదు లభించినట్లు సమాచారం. నగదు కట్టలను లెక్కిస్తున్న దృశ్యాలు, బంగారు ఆభరణాలను సీజ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోదాల్లో కిలోకు పైగా బంగారు ఆభరణాలు, సుమారు 2.5 కిలోల వెండి వస్తువులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు పలు కీలకమైన ఆస్తి పత్రాలు, బ్యాంకు డాక్యుమెంట్లు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలు బయటపడినట్లు సమాచారం.
అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా మరిన్ని ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యంగా బెనామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారా అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.
ఏసీబీ ప్రాథమిక అంచనా ప్రకారం ఎస్.ఎల్. కుమార్కు చెందిన ఆస్తుల మొత్తం విలువ మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.100 కోట్ల వరకు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల్లో హైదరాబాద్లోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీల్లో మూడు విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నట్లు తెలిసింది.
దీనితో పాటు నగర పరిసర ప్రాంతాల్లో ఆరు ఓపెన్ ప్లాట్లు, నిజామాబాద్ జిల్లాలో మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ఖరీదైన కార్లు కూడా ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు సమాచారం. ఆస్తుల కొనుగోలు వివరాలు, వాటి కోసం ఉపయోగించిన నిధుల మూలాలు, బ్యాంకు లావాదేవీలపై అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు.
సోదాల అనంతరం ఎస్.ఎల్. కుమార్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆయన అధికార హోదాను ఉపయోగించుకుని అక్రమ సంపాదన చేశారా? టెండర్లు, కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపుల్లో అవినీతి జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.అధికారుల సమాచారం ప్రకారం త్వరలోనే ఆయనకు సంబంధించిన బ్యాంకు లాకర్లను కూడా తెరిచి తనిఖీ చేయనున్నారు. మరిన్ని నగదు, బంగారం లేదా కీలక పత్రాలు బయటపడే అవకాశముందని భావిస్తున్నారు.
ఈ ఘటనతో హైదరాబాద్ వాటర్ బోర్డులో తీవ్ర కలకలం రేగింది. కీలక పదవిలో ఉన్న అధికారి వద్ద ఇంత భారీ స్థాయిలో ఆస్తులు బయటపడటం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇతర అధికారులపై కూడా ఏసీబీ నిఘా పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఎవరినీ వదిలిపెట్టబోమని ఏసీబీ స్పష్టం చేస్తోంది.





