భారతీయ రైల్వే మరో చారిత్రాత్మక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ఔషధాల రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఔషధి ఎక్స్ప్రెస్’ పేరుతో ఫార్మసీ రైలును ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్పీటీ) వరకు ఈ ప్రత్యేక రైలు తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు.
ఈ నెల 2వ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఔషధి ఎక్స్ప్రెస్, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఔషధాలను సురక్షితంగా ముంబై పోర్టుకు తరలించింది. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతులు మరింత వేగవంతం కానున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ను దేశ ఫార్మా రాజధానిగా గుర్తించే నేపథ్యంలో ఈ ప్రత్యేక రైలు ప్రారంభం పరిశ్రమలకు పెద్ద ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు.
హైదరాబాద్ నగరం ఇప్పటికే ప్రపంచస్థాయి ఔషధ తయారీ కేంద్రంగా ఎదిగింది. వందలాది ఫార్మా కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ దేశాలకు భారీ ఎత్తున మందులు, వ్యాక్సిన్లు, ఔషధ ముడిసరుకులను హైదరాబాద్ నుంచి ఎగుమతి చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రోడ్డు మార్గం ద్వారా ముంబై పోర్టుకు ఔషధాలను తరలించడం కంపెనీలకు పెద్ద సవాలుగా ఉండేది.
ముఖ్యంగా కొన్ని మందులు నిర్దిష్ట ఉష్ణోగ్రతలోనే నిల్వ ఉండాలి. రవాణా సమయంలో ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తే ఔషధాల నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉండేది. అలాగే ట్రాఫిక్ కారణంగా సరుకు సమయానికి చేరకపోవడం కూడా సమస్యగా మారేది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే తీసుకొచ్చిన ఔషధి ఎక్స్ప్రెస్ ఫార్మా రంగానికి గేమ్ ఛేంజర్గా మారనుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఔషధాల నాణ్యతను కాపాడేందుకు ఈ ప్రత్యేక రైలులో అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ కంటైనర్లను ఏర్పాటు చేశారు. మందులను నిర్దిష్ట ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచే విధంగా ప్రత్యేక సాంకేతిక వ్యవస్థలను అమలు చేశారు. దీని వల్ల రవాణా సమయంలో మందుల నాణ్యత దెబ్బతినకుండా సురక్షితంగా గమ్యస్థానానికి చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫార్మా ఉత్పత్తుల రవాణాలో కోల్డ్ చైన్ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా వ్యాక్సిన్లు, బయోలాజికల్ డ్రగ్స్, ప్రత్యేక ఔషధాలు తగిన ఉష్ణోగ్రతలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే ఈ ప్రత్యేక రైలును రూపొందించింది.
హైదరాబాద్లోని ఔషధ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను వేగంగా, సురక్షితంగా ముంబై జేఎన్పీటీ పోర్టుకు చేరవేసే అవకాశం ఇప్పుడు కలిగింది. అక్కడి నుంచి యూరప్, అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు మరింత సులభతరం కానున్నాయి. రవాణా సమయం తగ్గడంతో పాటు ఖర్చులు తగ్గుతాయని, రోడ్డు మార్గంతో పోలిస్తే రైల్వే ద్వారా పెద్ద మొత్తంలో సరుకును ఒకేసారి తరలించవచ్చు. దీని వల్ల లాజిస్టిక్స్ వ్యయం తగ్గడమే కాకుండా, ఎగుమతుల సామర్థ్యం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.
హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, బయోటెక్నాలజీ, ఫార్మా రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఇప్పుడు దేశ తొలి ఫార్మసీ రైలు ప్రారంభం కావడంతో తెలంగాణకు మరో ప్రత్యేక గుర్తింపు లభించినట్లైంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభించే అవకాశముంది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, భారతీయ రైల్వే దేశ అభివృద్ధికి అనుగుణంగా ఆధునిక సేవలను అందిస్తోందని అన్నారు. ఫార్మా రంగం అవసరాలను గుర్తించి ప్రత్యేకంగా రూపొందించిన ఔషధి ఎక్స్ప్రెస్ భవిష్యత్తులో దేశ ఎగుమతులకు కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. మందుల రవాణాలో నాణ్యత, భద్రత, వేగం అత్యంత ముఖ్యమని, వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ను అమలు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇతర ఫార్మా హబ్లకు కూడా ఇలాంటి సేవలను విస్తరించే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చారు.





