తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది.పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు మెుదలు పెట్టింది. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా స్కూల్ విద్యను 12వ తరగతి వరకు ఒకే వ్యవస్థలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి 2026-27 విద్యాసంవత్సరం నుంచే 11 తరగతి బోధన ప్రారంభిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కొత్త విద్యావిధానం అమలులోకి వస్తే పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇకపై జూనియర్ కాలేజీలకు వెళ్లకుండా అదే పాఠశాలలో 11 వ తరగతి(ప్లస్ టూ ఎడ్యుకేషన్ సిస్టమ్)చదవనున్నారు.
ఈ విధానం సక్సెస్ అయితే తెలంగాణలో పాఠశాల, ఇంటర్ విద్యకు ఒకే బోర్డు ఉండనుంది. ఇంకా చెప్పాలంటే ఇంటర్ బోర్డు విలీనం కానుంది అని తెలుస్తోంది. ఇకపోతే రాష్ట్రంలో ప్లస్ టూ విద్యావిధానం అమలుకు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఇంటర్ విద్య పాఠశాల విద్యలోకి విలీనం కానుంది. ఇకపై పాఠశాల, ఇంటర్ విద్యకు ఒకటే పరీక్షల బోర్డు ఉండే అవకాశం ఉది. నూతన విద్యాసంవత్సరం (2026-27) మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ విలీనంపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది.
అటు ఎస్ఎస్సీ బోర్డు ఇటు ఇంటర్ బోర్డు రెండింటికి వేర్వేరు చట్టాలున్న కారణంగా వాటిని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడో రేపో ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ ఇన్ఛార్జి సెక్రటరీ శ్రీదేవసేన సమక్షంలో పాఠశాల, ఇంటర్ విద్యాశాఖ అధికారులు గురువారం సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి బోర్డుకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (టీజీఎస్ఈబీ)గా నామకరణం చేస్తామని డిసెంబరులో విడుదల చేసినటువంటి రైజింగ్ తెలంగాణ దార్శనిక డాక్యుమెంట్లో ప్రభుత్వం స్పష్టం చేసిన అంశంపై మరోసారి చర్చించారు.
పాఠశాల విద్యలోకి ఇంటర్ విద్యను విలీనం చేయాలంటే ఆ రెండు చట్టాలను కలిపి ఒక కొత్త చట్టాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా పాఠశాల విద్యకు సంబంధించి తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్టు (1982) సవరించాల్సి ఉంది. అలాగే ఇటర్ విద్యకు సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా చట్టాన్ని (1971) రద్దు చేయాల్సి ఉంటుంది.





