వేసవి తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఇండియా మెట్రోలజీకల్ డిపార్ట్మెంట్ ఒకేసారి చల్లని శుభవార్తతో పాటు జాగ్రత్త సూచనలు జారీ చేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ప్రకటించిన ఐఎండీ, మే నెలలో దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. అయితే అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు, రాత్రి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృతంజయ మోహపత్ర వెల్లడించిన వివరాల ప్రకారం, ఈసారి నైరుతి రుతుపవనాలు మే 14 నుంచి 16 మధ్య అండమాన్, నికోబార్ దీవులను తాకే అవకాశం ఉంది. సాధారణంగా మాన్సూన్ ఈ ప్రాంతాలకు మే చివర్లో చేరుతుండగా, ఈసారి ముందుగానే ప్రవేశించనున్నట్లు అంచనా వేయడం గమనార్హం. ఇది వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా ఖరీఫ్ పంటల సాగుకు అనుకూలంగా మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మే నెలలో దేశ సగటు వర్షపాతం సాధారణం కంటే సుమారు 110 శాతం ఎక్కువగా ఉండొచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ, మధ్య భారత ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అయితే తూర్పు , ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని కూడా ఐఎండీ స్పష్టం చేసింది.
వర్షాల శుభవార్తతో పాటు ఐఎండీ మరోవైపు హెచ్చరికలు కూడా జారీ చేసింది. మే నెలలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు కొనసాగవచ్చని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, వాయువ్య భారత రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశముంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొంది. ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పులు వాతావరణ మార్పుల ప్రభావంతో సంబంధం ఉండవచ్చని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. ఒకవైపు వర్షపాతం పెరగడం, మరోవైపు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వంటి విభిన్న పరిస్థితులు ఎదురవడం దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
వ్యవసాయ రంగానికి ఇది మిశ్రమ సంకేతాలుగా కనిపిస్తోంది. ముందస్తుగా మాన్సూన్ రావడం రైతులకు లాభదాయకంగా ఉండొచ్చు. అయితే వడగాల్పులు తీవ్రంగా ఉంటే పంటలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వాతావరణ అంచనాలను గమనిస్తూ వ్యవసాయ కార్యకలాపాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లో కూడా వర్షాలు, ఉష్ణోగ్రతల మార్పులతో పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వర్షాల వల్ల ట్రాఫిక్ సమస్యలు, నీటిమునిగే పరిస్థితులు ఏర్పడవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు విద్యుత్ వినియోగాన్ని పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.





