ఇంధన అక్రమాలపై ఉక్కుపాదం: మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక

Must read

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరత, అక్రమాలపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో నదేండ్ల మనోహర్​ నేతృత్వంలోని పౌరసరఫరాల శాఖ అధికారులు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిని పరిశీలిస్తూ, అక్రమాలకు పాల్పడే వారిపై ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు.

టెలికాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో జిల్లాల వారీగా ఇంధన లభ్యత, సరఫరా విధానం, వినియోగదారులకు ఎదురవుతున్న సమస్యలపై వివరంగా చర్చించారు. ముఖ్యంగా ఇంధనాన్ని పక్కదారి పట్టించడం, నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించడం వంటి చర్యలను కట్టడి చేయాలని మంత్రి అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

కొన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా స్టాక్ ఉన్నప్పటికీ ‘నో స్టాక్’ బోర్డులు ఉంచి వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అలాంటి యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఎలాంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.

ఇంధన సరఫరాలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి బంకులో స్టాక్ వివరాలను స్పష్టంగా ప్రదర్శించే విధంగా పర్యవేక్షణ పెంచాలని చెప్పారు. వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ఇంధనం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘రేషన్ పద్ధతి’ను కొనసాగించాలని మంత్రి సూచించారు. ఇంధన లభ్యతను దృష్టిలో ఉంచుకుని వినియోగాన్ని నియంత్రించడం ద్వారా కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. అవసరమైన చోట్ల అదనపు సరఫరా చర్యలు కూడా చేపట్టాలని చెప్పారు.

ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి ఇంధన సరఫరా విషయంలో మంత్రి కీలక సూచనలు చేశారు. ఆక్వా రైతులు, వరి రైతులకు వ్యవసాయ పనులు నిరాటంకంగా కొనసాగేందుకు ఇంధన సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

సోషల్ మీడియా వేదికగా ఇంధన కొరతపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా తప్పుడు సమాచారం పంచే వారిని గుర్తించి, వెంటనే కేసులు నమోదు చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు. నిజమైన సమాచారం మాత్రమే ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించడం, అక్రమాలను అరికట్టడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!