విశాఖ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టెక్కీలు మృతి

Must read

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమిలి బీచ్ రోడ్డులో జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు యువ టెక్కీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఐటీ సంస్థ టెక్​ మహింద్రాలో పనిచేస్తున్న గంగిరి కుశాల్ కుమార్ (32), షేక్ తౌసీఫ్ (27) స్నేహితులు. కుశాల్ కుమార్ టీమ్ మేనేజర్‌గా, తౌసీఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ పనుల ఒత్తిడిని తగ్గించుకునేందుకు శుక్రవారం రాత్రి భీమిలి బీచ్ రోడ్డులోని ఓ రిసార్ట్‌లో బస చేసినట్లు సమాచారం.

శనివారం ఉదయం వారు రాయలేన్​ఫీల్డ్ బైక్‌పై భీమిలి వైపు బయలుదేరారు. ప్రయాణం సాఫీగా సాగుతుండగా, INS కలింగా గేటు దాటి ఎర్రమట్టి దిబ్బల సమీపానికి చేరుకునే సరికి ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న బైక్‌పై కుశాల్ కుమార్ నియంత్రణ కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

బైక్ అదుపుతప్పి ముందుగా రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ తరువాత వేగం తగ్గకుండానే పక్కనే ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఢీకొన్న తీవ్రతకు ఇద్దరికీ తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలాన్ని చూసినవారు ప్రమాద తీవ్రతను అంచనా వేసి షాక్‌కు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భీమిలి బీచ్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా యువత అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. రోడ్డు భద్రతపై మరింత అవగాహన కల్పించాలని, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!