సమాజానికి చేటు చేకూర్చే గంజాయి,డ్రగ్స్ వాడకాన్ని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోను ఉక్కు పాదంతో అణచి వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఆదేశించారు. బుధవారం సచివాలయంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ 2026 ఏడాదికి మొదటి త్రైమాసిక సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి చేటుగా పరిణమిస్తున్నగంజాయి ఇతర మత్తు పదార్ధాల సేవనాన్ని పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం ఉందని ఆదిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈగల్ చీఫ్ రవి కృష్ణను ఆదేశించారు.
గంజాయి,డ్రగ్స్ ఒక శాఖో రెండు శాఖలకో సంబంధించిన సమస్య కాదని ఇదొక సామాజిక సమస్య అని కావున వీటి నియంత్రణ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించ గలిగితేనే వీటిని పూర్తి స్థాయిలో నివారించ గలుగుతామని అన్నారు. అందువల్ల అన్ని శాఖలు ఈవిషయంలో మరింత సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
వీటి బారి నుంచి సమాజాన్ని మన పిల్లలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.గంజాయి సాగు, రవాణా నియంత్రణపై సమన్వయం చేసుకునేందుకు వీలుగా ఒడిస్సా సిఎస్ కు డిఓ లేఖ వ్రాయనున్నట్టు సిఎస్ సాయి ప్రసాద్ పేర్కొన్నారు.
డాక్టర్ ప్రిస్కిప్సన్ లేకుండా వివిధ మత్తు పదార్ధాలు (డ్రగ్స్)అమ్మాకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సిఎస్ సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి హోల్ సేల్ డీలర్లు వివిధ డ్రగ్స్ ను ఎంత మొత్తంలో కొనుగోలు చేసి రిటైల్ అమ్మకాలు చేస్తున్న వివరాలను డ్రగ్స్ రకం,బ్యాచ్ తదితర వివరాలను ముందుగానే ఆన్లైన్ ద్వారా ఈగల్ కార్యాలయానికి తెలియజేసేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.
పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకూ విద్యార్ధుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రవేశపెట్టేందుకు కృషి జరుగుతోందని అన్నారు. ఎక్సైజ్ శాఖ వద్ద 200 వరకూ ఎన్డిపిఎస్ కేసులు పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని, వీటి వాడకం వల్ల వచ్చే ప్రమాదాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆశాఖ అధికారులను సిఎస్ సాయి ప్రసాద్ ఆదేశించారు.





