రెండున్నరేళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి, రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్. అది పీసీ ఘోష్ కమిషన్ కాదని, ముమ్మాటికీ పీసీసీ (PCC) నివేదిక అని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్న మాట ఇవాళ అక్షరాల నిజమని తేలిపోయింది.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు ఒక గట్టి ‘చెంపపెట్టు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అభివర్ణించారు.
భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా దేశంలోని గౌరవ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఈ తీర్పుతో మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలకు బ్రేక్ పడినట్లయిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
అది పీసీ ఘోష్ కమిషన్ కాదని, ముమ్మాటికీ పీసీసీ (PCC) నివేదిక అని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్న మాట ఇవాళ అక్షరాల నిజమని తేలిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కమిషన్ విచారణలో సహజ న్యాయ సూత్రాలను పూర్తిగా విస్మరించడమే కాకుండా, నిబంధనలకు పాతరేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారని, ఆ విషయాలతో ఇవాళ హైకోర్టు కూడా ఏకీభవించడం హర్షణీయమని ఆయన తెలిపారు.
రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండున్నరేళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి, రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మేడిగడ్డ బ్యారేజీలో స్వల్పంగా దెబ్బతిన్న రెండు పిల్లర్లను రిపేర్ చేసి, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలని సూచించారు. రాజకీయ క్రీడ కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ఆయన హితవు పలికారు.





