అరుదైన జన్యుపరమైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం, వారి కుటుంబాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ‘ప్రాజెక్ట్ పునర్విక’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అత్యంత ఖరీదైన చికిత్స అవసరమైన పిల్లలకు ప్రభుత్వ సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రేరణగా నిలిచింది కర్నూలు జిల్లాకు చెందిన 11 నెలల చిన్నారి పునర్విక. ఈ చిన్నారి ఒక అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతూ ఉండగా, ఆమెకు అవసరమైన ప్రాణరక్షక ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లుగా ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ భారీ మొత్తాన్ని సమీకరించడం సాధారణ కుటుంబాలకు అసాధ్యమైన విషయమే. అయితే, పునర్విక కథ ప్రజల హృదయాలను కదిలించింది.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, “నిన్న 11 నెలల చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల విలువైన ప్రాణరక్షక ఇంజెక్షన్ ఇస్తుండగా పక్కనే నిలబడ్డాను. నా జీవితంలో నేను అనుభవించిన అత్యంత భావోద్వేగ క్షణాల్లో అది ఒకటి” అని అన్నారు. చిన్నారి ఎదుర్కొంటున్న పోరాటాన్ని చూసి తనకు ఎంతో బాధ కలిగిందని, ఒక చిన్నారి జీవించడానికి చేస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కరి మనసును తాకుతుందని ఆయన పేర్కొన్నారు.
గత కొన్ని వారాలుగా పునర్విక కథ కేవలం ఒక వైద్య ఘటనగా కాకుండా, దేశవ్యాప్తంగా ఒక భావోద్వేగ ఉద్యమంగా మారింది. వేలాది మంది ప్రజలు సోషల్ మీడియా ద్వారా స్పందించి, తమ వంతు సహాయం అందించారు. అనేక సంస్థలు, దాతలు ముందుకు వచ్చి విరాళాలు సమకూర్చారు. ప్రతి ఒక్కరూ ఆ చిన్నారిలో తమ సొంత బిడ్డను చూసుకున్నట్లుగా భావించారు.
ఈ సంఘటన ప్రభుత్వాన్ని కూడా ఆలోచనలో పడేసింది. ఇలాంటి అరుదైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు చికిత్స అందించడం ఎంత కష్టమో గ్రహించిన ప్రభుత్వం, ‘ప్రాజెక్ట్ పునర్విక’ ద్వారా దీర్ఘకాలిక పరిష్కారాన్ని అందించాలని నిర్ణయించిందన్నారు. ఈ ప్రాజెక్ట్ కింద అవసరమైన వైద్య సాయం, ఆర్థిక సహాయం, ప్రత్యేక చికిత్సలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో అరుదైన వ్యాధుల గుర్తింపు, చికిత్స కోసం ప్రత్యేక వైద్య కేంద్రాలను అభివృద్ధి చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇలాంటి పిల్లలు సరైన సమయంలో చికిత్స పొందే అవకాశాలు మెరుగుపడతాయి.





