రాష్ట్ర రాజకీయ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక భేటీ అయ్యారు. హైదరాబాద్లోని సీఎం అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత అంశాలు, పరిపాలన సంబంధిత నిర్ణయాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చలు జరుగినట్లు సమాచారం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ అంశం ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా నిలిచినట్లు తెలిసింది.
కార్పొరేషన్లు, బోర్డులు, ట్రస్టులు వంటి పలు సంస్థల్లో పదవులు ఖాళీగా ఉండటంతో వాటిని త్వరితగతిన భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీకి సేవలందించిన నేతలు, సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతౌల్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
పదవీకాలం ముగిసిన కార్పొరేషన్ ఛైర్మన్ల రీన్యువల్ అంశం కూడా చర్చకు వచ్చాయి. ఇప్పటికే పనితీరు ఆధారంగా కొందరి పదవీకాలాన్ని పొడిగించాలా? లేక కొత్తవారికి అవకాశం కల్పించాలా? అనే అంశంపై అభిప్రాయాలు పంచుకున్నారు.
ప్రభుత్వ పనితీరును ప్రజలకు చేరవేయడంలో ఈ సంస్థల పాత్ర కీలకమని భావిస్తున్నారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. ఆయన తీసుకున్న నిర్ణయం పార్టీపై చూపే ప్రభావం చూపుతుందా అని ఆలోచించారు.
ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో ఏర్పడుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, కేడర్లో ఉత్సాహం నింపే వ్యూహాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
ఇటీవల మంత్రులు, ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఈ సమావేశంలో సమీక్షించారు. ముఖ్యంగా పరిపాలన, సంక్షేమ పథకాలు, ఆర్థిక పరిస్థితులపై వస్తున్న విమర్శలకు ఎలా ప్రతిస్పందించాలి? అనే అంశంపై వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది





