రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కంది మండల కేంద్రంలోని ఐఐటీ ప్రాంగణంలో రవాణా శాఖ, రోడ్లు & భవనాల (R&B) శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా “అరైవ్-అలైవ్” కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోని 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 13 నుండి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని ఆయన అన్నారు.రోడ్డు ప్రమాదాలు ఒక కుటుంబాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని, భవిష్యత్తును చీకటిలో నెట్టేస్తాయని పేర్కొంటూ, చిన్నప్పటి నుంచే రోడ్డు భద్రతను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.ప్రమాదాల్లో గాయపడిన వారికి సాయం చేసే వారికి ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.8 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడం ఆందోళనకరమని, ప్రతి నిమిషం ఎక్కడో ఒకచోట ప్రమాదం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో వీడియోలు తీయడం కాకుండా బాధితులను ఆసుపత్రికి తరలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని, చిన్నప్పటి నుంచే వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.





