మేడ్చల్ జిల్లా, పీర్జాదిగూడలో పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరారు. ఈ చేరికల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వీరితో పాటు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి,మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, స్థానిక పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈసమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ని కాంగ్రెస్ పార్టీ కుప్పకూల్చింది. రెండు సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో హైదరాబాద్ని దెబ్బ కొట్టింది. కేవలం ఇక్కడి ప్రజలు ఓట్లు వేయలేదన్న ఏకైక కక్షతో, కోపంతో రేవంత్ రెడ్డి హైదరాబాద్కి ఈ దుస్థితి తీసుకువచ్చాడని ఆరోపించారు.
ఉన్న నగరాన్ని వదిలిపెట్టి తన రియల్ ఎస్టేట్ కోసం ఫోర్త్ సిటీని, ఫ్యూచర్ సిటీని ప్రమోట్ చేస్తున్నాడని, రాజధానిలో కనీసం దోమల నివారణ కూడా చర్యలు తీసుకోవడం లేదని, అతి దుర్మార్గమైన పరిపాలనా నెలకొన్నదని , నగరంలో 10 సంవత్సరాల క్రితం ఎప్పుడూ లేనటువంటి కరెంట్ కోతలు, మంచినీటి ఇబ్బందులు, పారిశుధ్య సమస్యలు అన్ని తిరిగి రాష్ట్ర రాజధానిలో దర్శనమిస్తున్నాయనీ ఆరోపించారు.
దీంతొ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని ఆవేదనను వ్యక్త పరిచారు. పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మార్గదర్శకత్వంలో, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి మెట్రో నగరంగా తీర్చిదిద్దామన్నారు.
కరెంట్ కోతలు లేకుండా, తాగునీరు, పారిశుధ్యం నుంచి మొదలుకొని ప్రజా రవాణా వరకు అన్ని రంగాల్లో నగరాన్ని ముందుకు తీసుకుపోయామని గుర్తు చేశారు. అందుకే ప్రజలు రెండు సార్లు రాష్ట్ర రాజధానిలో మేయర్ పీఠాన్ని మా పార్టీకి కట్టబెట్టారని ఆనందాన్ని వ్యక్త పరిచారు.
తెలంగాణ ఆర్థిక ఇంజన్ను కూలగొట్టి, నగరంలో రియల్ ఎస్టేట్ను, నగర ఆర్థిక వ్యవస్థను, వ్యాపార అవకాశాలు అన్నింటినీ కుప్పకూల్చి వేశారని, రాజదానిని పూర్తిగా నాశనం చేశారని, ముసి సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చుతూ.. వాళ్ల దు:ఖానికి కారణమౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు.





