రాష్ట్రంలో మత్స్యకారుల సమస్యలు, తీర ప్రాంత అభివృద్ధి అంశాలు మళ్లీ రాజకీయ చర్చకు దారితీశాయి. మత్స్యకారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ముఖ్యంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇది మత్స్యకారుల ప్రయోజనాల కోసం నిర్మించిన ప్రాజెక్ట్ అయినప్పటికీ, ప్రస్తుతం దానిని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం వెనుక ఉన్న లక్ష్యాన్ని వివరించిన జగన్, తమ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడం ప్రధాన ఉద్దేశమన్నారు. తీర ప్రాంతాల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించి, వలసలను తగ్గించడం, ఆదాయాన్ని పెంచడం కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు గుర్తు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించేందుకు భారీ ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.ఈ సమావేశంలో పాల్గొన్న మత్స్యకారులు కూడా తమ సమస్యలను నేరుగా వెల్లడించారు. గతంలో సరైన హార్బర్ లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనోపాధి పొందాల్సి వచ్చేదని చెప్పారు.
అయితే ఇప్పుడు అదే హార్బర్ను మత్స్యకారులకు అందకుండా ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యకారులు మరో ముఖ్య సమస్యను కూడా ప్రస్తావించారు. తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చే పడవలు స్థానిక మత్స్య సంపదపై ప్రభావం చూపుతున్నాయని, వాటిని నియంత్రించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సముద్రతీర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టామని, మారిటైమ్ బోర్డు ఏర్పాటు చేసి ప్రాజెక్టులను వేగవంతం చేశామని తెలిపారు. కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. తీర ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేశామని జగన్ వెల్లడించారు.





