ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరంలో ఒక వినూత్న దృశ్యం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా రోడ్డు పక్కన తోపుడు బండిపై పండ్లు, కూరగాయలు లేదా చిన్నచిన్న వస్తువులు అమ్మడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా భిన్నమైన పరిస్థితి కనిపింస్తుంది. తోపుడు బండిపై బంగారు ఆభరణాలు, నాణేలు విక్రయించడం చూసిన స్థానికులు, పర్యాటకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఈ మార్కెటింగ్ ప్రయత్నం వెనుక ఒక ప్రముఖ జ్యువెలరీ సంస్థ ఉందని సమాచారం. సాధారణ ప్రకటనలతో వినియోగదారులను ఆకర్షించడం కష్టమవుతున్న నేపథ్యంలో, కొత్త ఆలోచనతో ప్రజల దృష్టిని ఆకర్షించాలని ఈ సంస్థ భావించింది. అందులో భాగంగా ఈ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది.
బంగారం వంటి విలువైన వస్తువులను రోడ్డు పక్కన విక్రయించడం సాధారణ విషయం కాదు. అయితే ఈ సంస్థ భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ, వినియోగదారులకు నమ్మకాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేసింది. తోపుడు బండిపై ఉంచిన ఆభరణాలు కూడా పూర్తిగా పర్యవేక్షణలో ఉండేలా సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు.
సామాజిక మాధ్యమాల్లో ఈ వినూత్న ప్రచారం వేగంగా వైరల్ అవుతోంది. బంగారు ఆభరణాలను ఇలా ప్రత్యక్షంగా ప్రదర్శించడం వల్ల ప్రజలు దగ్గరికి వచ్చి చూడటం మాత్రమే కాకుండా కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యేకంగా పర్యాటకులు ఈ దృశ్యాన్ని ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పంచుకుంటూ మరింత ప్రచారం కల్పిస్తున్నారు.
మార్కెటింగ్ రంగంలో ఇటువంటి సృజనాత్మక ఆలోచనలు వినియోగదారులపై గొప్ప ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఆలోచించడం, భిన్నంగా ప్రదర్శించడం ద్వారా బ్రాండ్ గుర్తింపును పెంచుకోవచ్చని వారు చెబుతున్నారు. ఈ ప్రయోగం కూడా అదే దిశగా విజయవంతమవుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ బండిపై కేవలం రూ.800కే బంగారు నాణెం అందిస్తుండటం విశేషం. దీనిపై ఎలాంటి మేకింగ్ ఛార్జీలు కూడా లేవని చెబుతున్నారు. దాంతో చాలామంది ఆసక్తిగా కొనుగోలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, ఈ బండిపై కేవలం తక్కువ విలువైన బంగారు వస్తువులను మాత్రమే విక్రయానికి ఉంచామని. ఖరీదైన ఆభరణాలన్నీ షోరూమ్లలోనే అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ స్పష్టం చేశారు.





