గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అంది మారుమూల ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ సెంటర్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఆవరణలో 23 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో 50 బెడ్ల సామర్థ్యంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ అత్యవసర సేవల విభాగాన్ని, తెలకపల్లి మండల కేంద్రంలో1కోటి 59 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, రాష్ట్ర ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తూ, కమిషనర్ సృజన, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినా, హార్ట్ స్ట్రోక్ వచ్చినా, విష జ్వరాలు ప్రబలినా ఇకపై హైదరాబాద్ కు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా ఉండేందుకే చర్యలు చేపడుతున్నామని అన్నారు.
జిల్లా లో మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య సంరక్షణా అధిక ప్రాధాన్యత ఇచ్చి క్రిటికల్ కేర్ బ్లాక్ ద్వారా అత్యవసర సేవల విభాగాలను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. జిల్లా ప్రజలకు తమ సొంత జిల్లాల్లోనే కార్పొరేట్ స్థాయి ఎమర్జెన్సీ వైద్యం అందించేందుకు క్రిటికల్ కేర్ బ్లాక్(సీసీబీ)లను అందుబాటులోకి తేవడంతో ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో ప్రతి ఒక్కరు గ్రహించాలన్నారు.
గ్రామీణ, దూర ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల నర్సుల ఖాళీలను భర్తీ చేయడానికి భారీ స్థాయిలో నియామకాలు చేపడుతున్నామని వెల్లడించారు.
ప్రతి పేద కుటుంబానికి అందుబాటులోనాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని, అందుకే వైద్య రంగంలో సంస్కరణలను దశలవారీగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.





