ఆదిలాబాద్ జిల్లాలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ విమానాశ్రయం రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడనుంది, పౌర విమాన సర్వీసుల కోసం ప్రత్యేక ఎన్క్లేవ్ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.
సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఆదిలాబాద్లో ఇప్పటికే 360 ఎకరాల విస్తీర్ణంలో రక్షణ శాఖకు చెందిన ఎయిర్స్ట్రిప్ ఉంది. కానీ పూర్తి స్థాయి విమానాశ్రయ నిర్మాణానికి, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాల భూమిని అందించాల్సి ఉంటుందని వారు తెలిపారు.
ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధి తరువాత, ఎయిర్బస్ A320 వంటి పెద్దవాటి విమానాలు దిగడానికి వీలుగా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ది చేయానున్నారు. సాధారణ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు, ఎన్క్లేవ్ ద్వారా స్థానికులు, వ్యాపారులు సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతారని తెలిపారు, ఈ ప్రాజెక్ట్ దాదాపు అన్ని సాంకేతిక, భద్రతా ప్రమాణాలపై పూర్తి స్థాయిలో అమలు అవుతుంది.
ఈ విమానాశ్రయం ఏర్పాటుతో ఆదిలాబాద్ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడటమే కాకుండా, పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్కు 300 కి.మీ దూరంలో హైదరాబాద్, 170 కి.మీ దూరంలో నాగ్పూర్ విమానాశ్రయాలు ఉన్నాయి. స్థానికులు, వ్యాపారవేత్తలు ఈ నిర్ణయానికి సానుకూల స్పందన చూపుతూన్నారని, ప్రాంత అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సహకారంతో భవిష్యత్తులో ఈ ఎయిర్పోర్ట్ పూర్తిగా నిర్మించబడుతుంది. ఈ సమావేశంలో తెలంగాణలోని విమానాశ్రయల ప్రగతిని కూడా సమీక్షించారు. వరంగల్ లోని మామన్నూర్ ఎయిర్పోర్ట్ కు మూడు నెలల్లో శంకుస్థాపన చేస్తామని పెద్దపల్లి ఎయిర్పోర్ట్ కు స్థలంపై సానుకుల నివేదిక వచ్చిందని కొత్తగూడెంలో ప్రతిపాదించిన స్థలం అనువుగా లేనందున, ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు కేంద్ర మంత్రి వివరించారు.




